కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఇప్పుడు ఉద్యోగులు మార్చి 2023 వరకు 7.10 శాతం తక్కువ వడ్డీ రేటుతో ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్‌ను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణ రుణం వడ్డీ రేటును 7.9 శాతం నుండి 7.10 శాతానికి తగ్గించింది.  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇల్లు కట్టుకొనేందుకు తీసుకున్న అడ్వాన్స్‌పై వడ్డీరేటును కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం 7.9 శాతంగా ఉన్న వడ్డీని 7.1 శాతానికి తగ్గించింది. 2023 మార్చి వరకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 2022-23 ఏడాదికి గాను హౌజింగ్‌ కన్స్‌స్ట్రక్చ‌న్‌ అడ్వాన్స్‌ ఇంట్రెస్టు రేటు 7.1 శాతంగా ఉంటుందని అర్బన్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ 2022, ఏప్రిల్‌ 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కేవలం కేంద్ర ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

వడ్డీరేటు తగ్గించడం వల్ల కేంద్ర ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. 'హౌజ్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌ రూల్స్‌ (HBA)-2017ను సవరించాలని ఆదేశాలు అందాయి. ఇక నుంచి ఇల్లు కట్టుకొనేందుకు అడ్వాన్స్‌ తీసుకున్న ఉద్యోగులకు వడ్డీరేటును 7.10 శాతమే అమలు చేస్తారు. 2022 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 వరకు ఇదే వడ్డీరేటు అమలవుతుంది' అని అర్బన్‌ మినిస్ట్రీ తెలిసింది.  2023 ఆర్థిక ఏడాదిలో వడ్డీరేటును 80 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించడమే ఇందుకు కారణం.

ఉద్యోగులు ఇల్లు కట్టుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్‌ చెల్లిస్తుంది. ఉద్యోగి లేదా అతడి సతీమణి ప్లాట్‌లో నిర్మించుకొనేందుకు అవకాశం ఉంటుంది. 2020, అక్టోబర్‌లో ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద 2022 మార్చి 31 వరకు 7.9 శాతం వడ్డీరేటు అమలు చేశారు. ఇప్పుడు దానిని తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఉద్యోగులకు డీఏ పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది. కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 31 శాతం డీఏ ఇస్తున్నారు. దీనిని మరో 3 శాతానికి పెంచడంతో డీఏ 34 శాతానికి చేరుతుంది. బడ్జెట్‌ రెండో దశ సమావేశాలకు ముందే కేబినెట్‌ సమావేశమైంది. అప్పుడే ఈ అంశం చర్చకు వచ్చింది. తాజాగా నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

DA ఎందుకిస్తారంటే..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్‌ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్‌, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్‌ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.