‘యోనో’ తో ఫెస్టివ్ సేల్స్కు ఇలా ఎస్బీఐ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు
పండుగల వేళ దేశీయ అతిపెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ తొలిసారి యోనో యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి పది శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందజేస్తోంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఈ దఫా పండుగ సీజన్లో తన ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు డిజిటల్ వేదికను ఆలంభనగా చేసుకున్నది. ఈ పండుగల సీజన్లో డిజిటల్ వేదిక ‘యోనో (వైవోఎన్వో)’ యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు ఎస్బీఐ అదనపు రాయితీలు, క్యాస్బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. యోనో అంటే ‘యూ ఓన్లీ నీడ్ వన్’ అని అర్థం.
యోనో యాప్ తో 85 ఈ- కామర్స్ బంధం
ఈ యాప్తో 85 ఈ -కామర్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగిత రహిత బ్యాంకింగ్ సేవలతో పాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ ఉత్పత్తుల కొనుగోళ్లపై వినియోగదారులకు యోనో యాప్ సేవలందిస్తుంది.
డిజిటల్ షాపింగ్ వేడుకను అందిస్తున్న తొలి బ్యాంకు తమదేనని ఎస్బీఐ తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అక్టోబర్ 16-21 వరకు కొనుగోళ్లు జరిగే వినియోగదారులకు సంస్థ 10 శాతం వరకు రాయితీ, క్యాష్బ్యాక్ అందిస్తామని తెలిపింది.
14 ఈ-కామర్స్ సంస్థలతో కొనుగోళ్లు జరుపొచ్చు
యోనో ద్వారా 14 ఈ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు జరుప వచ్చునని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పవర్డ్ మొబైల్ ఫోన్లలో యోనో యాప్ అందుబాటులోకి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బహుమతులు, నగలు, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఆఫర్లు లభిస్తాయి.
ఈ- కామర్స్ బిజినెస్ చేసే వేదికలివే
అమెజాన్, జబాంగ్, మింత్రా, కల్యాన్, క్యారట్లేన్, పీసీజే, పెప్పర్ఫ్లై, ఓయో, టాటాక్లిక్, యాత్ర, ఈజ్మైట్రిప్, ఫస్ట్క్రై, ఐజీపీ, ఫెర్న్స్ అండ్ పెటల్స్ వంటి టాప్ డిజిటల్ మార్కెట్ వేదికల్లో వినియోగదారులు యోనో షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు పొందొచ్చు.
గతేడాది నవంబర్ నెలలో బ్యాంక్ ‘యోనో’ యాప్ సేవలను ప్రారంభించింది. యువతరానికి ఈ యాప్ ఎంతో ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం 30 లక్షల మంది కస్టమర్లు గల యోనో యాప్ లో ప్రతి రోజూ 25 వేల మంది వినియోగదారులు చేరుతున్నారని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా వివరించారు.
బైబై ఇండియాఎఫ్ఐఐలు: రెండు వారాల్లో రూ. 26,580 కోట్లు ఔట్
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత రెండు వారాలుగా క్యాపిటల్ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిపారు. మొదటి రెండు వారాల్లో మొత్తం రూ. 26,580 కోట్ల మేర అమ్మకాలు చేశారు. సెప్టెంబర్ నెలంతా కలిపి రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోగా, ఈ నెల తొలి రెండు వారాల్లో అంతకన్నా ఎక్కువగా విరమించుకున్నారు.
అక్టోబర్ 1- 12 తేదీల మధ్య రూ, 17,935 కోట్ల షేర్లను విక్రయించగా, రూ. 8,645 కోట్ల విలువైన బాండ్లను అమ్మారు. అక్టోబర్ నెలలో మార్కెట్ పతనం కూడా చాలా వేగంగా ఉన్న విషయం తెలిసిందే.
అమెరికా ట్రెజరీ రాబడుల పెరుగుదలతో ఎఫ్ఐఐల్లో ఆశలు
విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు (ఎఫ్ఐఐ) ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో మినహా అన్ని నెలల్లోనూ నికరంగా అమ్మకాలే జరిపారు. ఫిబ్రవరిలో అత్యధికంగా రూ. 18,619 కోట్ల అమ్మకాలుండగా, మే నెలలో రూ, 12,360 కోట్ల అమ్మకాలు జరిపారు. ఆ తర్వాత మళ్లీ ఈ నెలలోనే గరిష్టంగా షేర్లను విక్రయించారు.
అమెరికా ట్రెజరీ రాబడులు పెరుగడం, ట్రేడ్వార్ భయాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ చేసిన వ్యాఖ్యానాలతో ఎఫ్పీఐలు వర్ధమాన దేశాల క్యాపిటల్ మార్కెట్లలో అమ్మకాలు జరుపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.