Asianet News TeluguAsianet News Telugu

మోదీ ఆర్థిక ప్యాకేజీతో కొంత మాత్రమే ఎకానమీకి లబ్ధి .. తేల్చేసిన మూడీస్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో పాక్షికంగానే ఎకానమీకి లబ్ధి చేకూరుతుందని మూడీస్ నివేదిక వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 

Economic stimulus to partially offset negative impact of coronavirus: Moody's
Author
Hyderabad, First Published May 20, 2020, 12:14 PM IST

మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ... ఆర్థిక సంస్థలు నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ పేర్కొంది. అయితే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదని విశ్లేషించింది.

కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎమ్​ఎస్​ఎమ్​ఈ) రూ.3.70 లక్షల కోట్ల మేర ఉద్దీపనలు ప్రకటించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్​బీఎఫ్​సీ) రూ.75,000 కోట్లు, విద్యుత్​ పంపిణీ సంస్థలకు రూ.90,000 కోట్లు కేటాయించింది. కరోనా సంక్షోభాన్ని జయించి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

కరోనా సంక్షోభం కంటే ముందే.. అంటే గత 18 నెలలుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని మూడీస్ గుర్తు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం మరింత ద్రవ్య సమస్యలకు దారితీస్తుందని విశ్లేషించింది.

కరోనా ప్యాకేజీ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కం) తక్షణ ఆర్థిక అవసరాలను తీరుస్తుందని మూడీస్ అంచనా వేసింది. ఈ రంగానికి రుణాలు మంజూరు చేసిన సంస్థలకూ నష్టాలు తగ్గుతాయని పేర్కొంది. 

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్​ లిమిటెడ్​కు రాష్ట్ర ప్రభుత్వాల హామీ వల్ల కొంత ఊరట లభించింది. కానీ కొత్త లిక్విడిటీ క్యాపిటల్​ను అవి పెంచకోకపోతే కొత్త రుణాలు పరపతి తగ్గిపోతుందని మూడీస్ తెలిపింది.

కరోనా మహమ్మారితో తలెత్తిన అంతరాయాల వల్ల నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎప్సీ) మరింత నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ నివేదిక హెచ్చరించింది. ఎన్బీఎప్సీల ఆస్తుల నాణ్యతను మరింత దిగజారనుందని, దీంతో ఎన్బీఎప్సీల పరిస్థితి అధ్వాన్నంగా మారనుందని నివేదిక తెలిపింది.

also read లాక్‌డౌన్ ఎఫెక్ట్:ఆర్థిక మాంద్యం ముప్పులో ప్రపంచం.. డబ్ల్యూఈఎఫ్ ఆందోళన

కరోనా మహమ్మారి ఆట కట్టించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగిందని, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మాంద్యం మరింత పెరిగే అవకాశం ఉందని మూడీస్ తెలిపింది.

ఇది ఎన్బీఎప్సీల ఆస్తి నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుందని మూడీస్ తెలిపింది. మాంద్యం వల్ల ప్రజల ఆర్థిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందన్నది. ఇది ఎన్బీఎప్సీ రుణాన్ని తిరిగి చెల్లించడంలో వినియోగదారులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.

మూడీస్ నివేదిక ప్రకారం, అధిక రిస్క్ ఉన్న ప్రాంతాలకు రుణాలు అందిస్తున్నందున ఎన్బీఎప్సీల ఆస్తి నాణ్యత బ్యాంకుల కంటే ఎక్కువగా ప్రభావితమవుతుంది. రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2018లో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్ చెల్లింపులో విఫలమైన తర్వాత ఎన్బీఎప్సీల్లో నగదు సంక్షోభం పెరిగింది. 


ఇప్పుడు కరోనా మహమ్మారి ఎన్బీఎప్సీలకు ఈ సమస్యను మరింత పెంచుతుందని మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. అదనంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వివిధ రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం (తాత్కాలిక నిషేధం ఎంపిక) ఇవ్వడం వల్ల సమీప కాలంలో ఎన్బీఎఫ్సీల నగదు పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు.

ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు పూచీకత్తులేని రుణాలు అందించడానికి రూ.3 లక్షల కోట్లు కేటాయించడం, రుణాల చెల్లింపు విషయంలో ఏడాది పాటు మారటోరియం విధించడం మంచి పరిణామమని మూడీస్ తెలిపింది. ఫలితంగా ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ఆర్థిక చేయూత కలుగుతుందని, ఈ రంగానికి రుణాలు అందిస్తున్న బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల ఆస్తి నష్టాలు కూడా తగ్గుతాయని పేర్కొంది.

"కరోనా ప్యాకేజీ ఎన్​బీఎఫ్​సీల మొత్తం రుణాల్లో 2 శాతానికి మాత్రమే సరిపోతాయి. కానీ టాప్ 20 ఎన్​బీఎఫ్​సీల రుణాలే 75 శాతం వరకు ఉంటాయి" అని మూడీస్ తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు ఆర్​బీఐ చేపడుతున్న లిక్విడిటీ చర్యలు కేవలం పెద్ద బ్యాంకింగేతర సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూర్చాయని, చిన్న ఎన్​బీఎఫ్​సీలకు మాత్రం ప్రయోజనం కలిగించలేదని మూడీస్ స్పష్టం చేసింది.

కాబట్టి మోదీ ప్యాకేజీ బ్యాంకింగేతర రంగానికి ఏమంత గొప్పగా సహాయపడదని మూడీస్ అభిప్రాయపడింది. వీటికి రుణాలు అందిస్తున్న బ్యాంకింగ్ రంగంలో నష్టాలు కొనసాగుతాయని అభిప్రాయపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios