సిద్ధార్థ ఆత్మహత్య... లాభాల బాటపట్టిన కాఫీడే
ఇన్వెస్టర్ల కొనుగోలుతో 5శాతానికిపైగా లాభపడి రూ.65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయ్యింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడు వారాల్లో 68శాతం పతనమయ్యింది.
కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యతో కాఫీడే షేర్లు ఒక్కసారిగా నష్టాలు చవిచూశాయి. భారీ నష్టాల్లో పడిపోయిన కాఫీడే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో కాఫీడే యాజమాన్యం పడింది. మరో వైపు పానీయాల గ్లోబల్ కంపెనీ కోకా కోలా వాటాను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ రెండు కారణాల దృష్ట్యా కాఫీడే షేర్లు బలంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోలుతో 5శాతానికిపైగా లాభపడి రూ.65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయ్యింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడు వారాల్లో 68శాతం పతనమయ్యింది.
కాగా.. పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీడే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ.2,400కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూపు రుణ భారం ఆమేర తగ్గించనుందని వివరించింది. జులై చివరికల్లా గ్రూపు రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472కోట్లుగా పేర్కొంది.
ప్రధానంగా బెంగళూరులోని గ్లోబెల్ విలేజ్ పార్క్ ను పీఈదిగ్గజం బ్లాక్ స్టోన్ కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్న సంగతి తెలిసిందే. మరో వైపు కంపెనీలో వాటాను విక్రయించేందుకు కోకో కోలాతో కాఫీడే తిరిగి చర్చలు ప్రారంభించింది. ఈ అంశాలన్నీ షేర్లు బలపడటానికి దోహదం చేశాయి.