సంపన్నులపై టాక్స్.. వెహికల్స్ ఉత్పత్తికోత.. రూ.5.61 లక్షల కోట్లు హాంఫట్
నిర్మలాసీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ వర్గాలను ఆకర్షించలేదు. సంపన్నులపై పన్ను విధిస్తామనడం సెంటిమెంట్ను దెబ్బ తీసింది. షేర్ల బై బ్యాక్ పైనా నిబంధనల ఆంక్షలు విధించింది. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు కలిసి వచ్చాయి. సేల్స్ తగ్గిపోవడంతో ఉత్పత్తిలో వాహనాల తయారీ సంస్థలు కోత విధించడం ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఫలితంగా రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.61 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
న్యూఢిల్లీ: విత్తమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు స్టాక్ మార్కెట్కు రుచించలేదు. సోమవారం స్టాక్ మార్కెట్ భారీ పతనం కావడంతో మదుపర్ల సంపద రూ.3,39,192.97 కోట్లు తగ్గి రూ.1,47,96,302.89 కోట్లకు పరిమితమైంది. శుక్ర వారం ట్రేడింగ్తో కలిపి గత రెండు ట్రేడింగ్ రోజుల్లో మదుపర్ల సంపద రూ.5,61,772.64 కోట్లు క్షీణించడం గమనార్హం.
పన్నుల పెంపు వంటి అంశాలు మదుపర్లకు కంటగింపుగా మారాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, హీరోమోటోకార్ప్లతో ట్రేడింగ్ ఒక ఆటాడుకుంది. ఆ దెబ్బకు అన్ని రంగాల షేర్లూ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. యెస్ బ్యాంక్, టీసీఎస్ కాస్త మెరుగ్గా ఉన్నా ఫలితం లేకుండా పోయింది.
సోమవారం బడ్జెట్, విదేశీ పరిణామాలు ప్రతికూల ఫలితాలనిచ్చాయి.ముఖ్యంగా బడ్జెట్ దూకుడును పెంచింది. తన అమ్ములపొదిలో నుంచి పన్నుల పెంపు అస్త్రాన్ని మళ్లీ తీసింది. అధిక సంపన్నుల ఆదాయపు పన్నుపై సర్ఛార్జీ పెంపు, ప్రజల కనీస వాటా 35 శాతం ఉండాలనే ప్రతిపాదన, బైబ్యాక్పై పన్న విధింపు అస్త్రాలను ప్రయోగించడంతో మదుపర్లలో సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. ఫలితంగా షేర్లన్నీ పతనమయ్యాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ భారీ నష్టంతో 39,476.38 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత మరింత విశ్వరూపం చూపడంతో ఒకానొక దశలో 908 పాయింట్ల నష్టంతో 38,605.48 స్థాయికి దిగివచ్చింది. చివరకు 792.82 పాయింట్లు నష్టపోయి 38,720.57 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 252.55 పాయింట్లు కోల్పోయి 11,559 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడం ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే తొలిసారి.
బజాజ్ ఫైనాన్స్ షేర్ 8.18%, ఆ తర్వాతీ స్థానాల్లో ఓఎన్జీసీ 5.43%), హీరోమోటోకార్ప్ 5.31%, మారుతీ సుజుకీ 5.21%, ఎన్టీపీసీ 4.98%, ఎల్అండ్టీ 4.14%, హెచ్డీఎఫ్సీ 0.77%, ఎస్బీఐ 4.14%, యాక్సిస్ బ్యాంక్ 2.84% కూడా భారీగా నష్టపోయాయి. యెస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు మాత్రం ఇందుకు భిన్నంగా రాణించాయి.
బీఎస్ఈలో 1,953 షేర్లు ప్రతికూలంగాను, 571 సానుకూలంగాను ముగిశాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.47% మేర పతనమయ్యాయి.
అంతా చేసింది..
స్టాక్ మార్కెట్ల పతనానికి ఐదు అంశాలు దోహద పడ్డాయి. అధిక సంపన్న వర్గం చెల్లించే ఆదాయపు పన్నుపై సర్ఛార్జీ పెంపు ఓ ముఖ్య కారణం. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక మూలదన లాభాలపై పన్ను భారం పెరుగుతుందని భావించి విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు అమ్మకాలకు పూనుకున్నారు.
అయితే సర్ఛార్జీ పెంపుపై ఎఫ్పీఐల్లో నెలకొన్న ఆందోళనను సీబీడీటీ బోర్డు పరిశీలించి, త్వరలోనే స్పష్టత ఇస్తుందని సీబీడీటీ ఛైర్మన్ ప్రమోద్ చంద్ర వెల్లడించారు. అయితే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని మరికాసేపటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరం అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమైంది.
కంపెనీల్లో కనీస ప్రజల వాటా 35 శాతానికి పెంచాలనే ప్రతిపాదన కూడా అమ్మకాల వైపు మొగ్గు చూపేలా చేసింది.షేర్ల బైబ్యాక్పైన పన్ను విధింపు ప్రతిపాదన కూడా సెంటిమెంటును దెబ్బతీసింది.
వాహనాల విక్రయాలు తగ్గడంతో ఉత్పత్తి కోతను వాహన తయారీదార్లు కొనసాగించనున్నారనే వార్తల నేపథ్యంలో దిగ్గజ వాహన కంపెనీల షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కదలాడటమూ మన మార్కెట్ నష్టాలకు కారణం.
భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం మంజూరులో మోసానికి గురైన పీఎన్బీ షేరు ఒత్తిడికి లోనయ్యింది. బీఎస్ఈలో 10.95% క్షీణించి రూ.72.80 వద్ద ముగిసింది. ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వరుసగా ఐదో నెలా వాహనాల తయారీని నిలిపివేయడమే స్టాక్ భారీగా 5.21 శాతం పతనానికి కారణమైంది.
ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ ప్రమోటర్గా మారిన మైండ్ట్రీ కంపెనీ వ్యవస్థాపకులైన కృష్ణకుమార్ నటరాజన్, పార్ధసారథి ఎన్.ఎస్, రోస్తో రావణన్లు కంపెనీ బోర్డు, ఎగ్జిక్యూటివ్ పదవులకు రాజీనామా చేయడం ప్రతికూల పరిస్థితులకు దారితీసింది. బీఎస్ఈలో 10.43% క్షీణించి రూ.773.95 వద్ద మైండ్ ట్రీ షేర్ స్థిరపడింది.