14 మెసేజింగ్ యాప్స్పై కేంద్రం నిషేధం..పొరపాటున మీరు ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారేమో చెక్ చేసుకోండి..
పాకిస్థాన్ ఉగ్రవాదులకు కమ్యూనికేషన్ అందించేందుకు ఉపయోగపడుతున్న 14 మొబైల్ మెసెంజర్ యాప్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్లపై చర్యలు తీసుకోవడం ద్వారా భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోనుందనే సంకేతాలు పంపింది.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి మొబైల్ యాప్స్ పైన కొరడా చూపించింది. తాజాగా 14 మొబైల్ మెసెంజర్ యాప్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. పాకిస్తాన్ నుండి సందేశాలను వ్యాప్తి చేయడానికి, సందేశాలను స్వీకరించడానికి ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్లను ఉపయోగించారని కేంద్ర ఏజెన్సీలో ఆరోపిస్తున్నాయి. ఈ సమాచారాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ సోమవారం తన ట్విట్టర్ ఎకౌంట్లో షేర్ చేసింది.
ఇండియా టుడే అందించిన సమాచారం ప్రకారం, నిషేధించిన మెసెంజర్ అప్లికేషన్లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్, బీచాట్, నాండ్బాక్స్, కోనియన్, IMO, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలు, ఆ సంస్థల్లో పని చేసే సానుభూతిపరులకు, ఇతర కార్యకర్తలకు కోడ్తో కూడిన సందేశాలను పంపడానికి పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఈ అప్లికేషన్ లను ఉపయోగించారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి .
దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్లపై చర్యలు కొత్తేమీ కాదు. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చైనీస్ యాప్లను నిషేధించింది. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశం, రక్షణ, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంటూ భారత ప్రభుత్వం దాదాపు 250 చైనీస్ యాప్లను నిషేధించింది.
ఇప్పటికే TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, Xender, CamScanner, PUBG Mobile , Garena Free Fire వంటి ప్రముఖ మొబైల్ గేమ్లతో సహా 200 కంటే ఎక్కువ చైనీస్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది.