బీఎస్ఎన్ఎల్ 'రక్షాబంధన్' బంపర్ ఆఫర్
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రాఖీఫౌర్ణమి ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రాఖీఫౌర్ణమి ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది. రాఖీ పండుగ ప్రారంభం నుంచి అంటే ఆదివారం నుంచి 'రక్షాబంధన్' స్పెషల్ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పెషల్ ఆఫర్ ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తుందని సంస్థ ట్వీట్ చేసింది. ఈ సరి కొత్త రీచార్జ్పై వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
రూ.399 రీచార్జీపై అపరిమిత డేటా ఆఫర్
రూ.399 రీచార్జ్పై ప్రతి రోజూ ఒక జీబీ డేటా చొప్పున 74 రోజుల పాటు అపరిమిత డేటా ఆఫర్ చేస్తోంది. ఇంకా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తోంది. ఈ 'రక్షాబంధన్' ఆఫర్ దేశమంతటా వర్తిస్తుంది. అన్లిమిటెడ్ పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్బీటీ)ను ఉచితంగా అందిస్తుంది.
డిజిటల్ లావాదేవీల్లో అగ్రస్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిపిన బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఆర్థిక సేవల విభాగం నివేదిక పేర్కొన్నదని పీఎన్బీ తెలిపింది. ఇక అన్ని బ్యాంకుల్లోని డిజిటల్ లావాదేవీల్లో మాత్రం పీఎన్బీకి ఆరో స్థానం లభించింది.
డిజిటల్ ఇండియాపై నిబద్ధతో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్
‘డిజిటల్ ఇండియా కార్యక్రమానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు కట్టుబడి ఉంది. ఇటీవల ఆర్థిక సేవల విభాగం వెల్లడించిన నివేదిక ప్రకారం.. డిజిటల్ లావాదేవీల్లో పీఎన్బీ నంబర్ వన్ ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. 71 స్కోరుతో బ్యాంకుకు ప్రభుత్వం గుడ్ రేటింగ్ ఇచ్చింది’ అని పీఎన్బీ ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు జరిపిన మొత్తం డిజిటల్ లావాదేవీల్లో కేవలం 0.83శాతం మాత్రమే సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
డిజిటల్ రేటింగ్తో పీఎన్బీకి ఊరట
వేల కోట్ల కుంభకోణంతో గత కొంతకాలంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సహా పలువురు వ్యక్తులు బ్యాంకు నుంచి అక్రమంగా ఎల్ఓయూలు తీసుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు పొందినట్లు ఇటీవల వెల్లడైంది. ఈ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకు ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకుంది. పీఎన్బీ రేటింగ్ కూడా తగ్గిపోయింది. తాజాగా డిజిటల్ లావాదేవీల్లో పీఎన్బీ టాప్లో ఉండటంతో బ్యాంకుకు కొంత ఊరట కల్గినట్లయింది.