ఎస్ మాదే మిస్టేక్: 737 మాక్స్ కాక్పిట్ అలర్ట్పై బోయింగ్ సీఈఓ
బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో అమర్చిన కాక్ పిట్ వార్నింగ్ సిస్టమ్ సరిగ్గా పని చేయకపోవడం నిజమేనని సంస్థ సీఈఓ డెన్నిస్ మౌలెన్ బర్గ్ తెలిపారు. దీనికి తమదే పొరపాటని పారిస్లో జరుగుతున్న ఎయిర్ షోలో పాల్గొనేందుకు వచ్చిన మౌలెన్ బర్గ్ చెప్పారు.
Paris, First Published Jun 17, 2019, 4:38 PM IST
పారిస్: అమెరికాకు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్’ సీఈఓ డెన్నిస్ మౌలెన్ బర్గ్ ఎట్టకేలకు తమ తప్పిదాన్ని అంగీకరించారు. బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాల్లో అమర్చిన కాక్ పిట్ వార్నింగ్ సిస్టమ్ ప్రాబ్లమాటిక్గా ఉన్నదని అంగీకరించారు. ఇటీవలి కాలంలో సదరు బోయింగ్ 737 మాక్స్ విమానాలు రెండు ప్రమాదానికి గురి కావడంతో 346 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
రెండు వరుస ప్రమాదాల తర్వాత పలు దేశాలు బోయింగ్ 737 మాక్స్ విమానాల నిర్వహణ నిలిపివేశాయి. కొన్ని దేశాలు, విమానయాన సంస్థలు నిషేధించాయి. దీంతో పొరపాటు ఎక్కడ ఉన్నదన్న విషయమై బోయింగ్ యాజమాన్యం ద్రుష్టి సారించింది.
బోయింగ్ 737 మాక్స్ విమానంలో అమర్చిన కాక్ పిట్ వార్నింగ్ సిస్టమ్ను పారదర్శకంగా సరి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పందించింది. బోయింగ్ యాజమాన్యం తన 737 మాక్స్ విమానంలో అమర్చిన కాకప్లోని సేఫ్టీ ఇండికేటర్ పని చేయడం లేదని ఏడాదిన్నర కాలంగా చెప్పలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ తప్పుబట్టింది.
తమ సంస్థలకు గానీ, విమానయాన నియంత్రణ సంస్థలకు గానీ సదరు బోయింగ్ యాజమాన్యం.. తన 737 మాక్స్ విమానాల్లో చేర్సిన న్యూ సాఫ్ట్ వేర్ అమలులో ఇబ్బందుల సంగతి చెప్పలేదని పలు విమానయాన సంస్థల పైలట్లు ఆగ్రహిస్తున్నారు. ఇటీవల ఇండోనేషియా, ఇథియోపియాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
‘మేం బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో అలర్ట్ అమలు గురించి తెలియజేయడంలో పొరపాటు చేశామని స్పష్టం చేయదలిచాం‘అని బోయింగ్ సీఈఓ మౌలిన్ బర్గ్ తెలిపారు. త్వరలో బోయింగ్ 737 మాక్స్ విమానం పనితీరు మెరుగవుతుందని, తిరిగి ఏడాది చివరికల్లా టేకాఫ్ తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇథియోపియా, ఇండోనేషియా దేశాల్లో విమాన ప్రమాదాలు జరిగినప్పటి నుంచి మూడు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 737 మాక్స్ విమానం విమానాశ్రయాలకే పరిమితమైంది. పలు విమానయాన నియంత్రణ సంస్థలు బోయింగ్ సాఫ్ట్ వేర్ సరి చేసినట్లు ధ్రువీకరించే వరకు వాటిని గ్రౌండ్ చేయాలని నిర్ణయించాయి. పారిస్ లో జరుగుతున్న ఎయిర్ షోలో పాల్గొనేందుకు వచ్చిన మౌలెన్ బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Last Updated Jun 17, 2019, 4:38 PM IST