బి అలర్ట్ : సైబర్ మోసగాళ్లున్నారు..ఆ లింకులను క్లిక్ చేయొద్దు..
డిజిటల్ చెల్లింపులు జరిపేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్, బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్ పేరిట సైబర్ నేరగాళ్లు ముందుకు వస్తున్నారని, బ్యాంక్ అధికారిక యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయొద్దని పేర్కొంటున్నారు.
న్యూఢిల్లీ: టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మన నిత్య జీవితంలో యూపీఐ పేమెంట్స్ భాగమైపోయాయి. డిజిటల్ పేమెంట్స్ను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం, స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోకి అందుబాటులోకి రావడం ఇందుకు కారణం. కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా? అని ఈ పేమెంట్స్ వాడకం మరింత ఎక్కువయ్యాయి.
కరోనాను నియంత్రించడానికి భౌతిక దూరం పాటించాలనే నిబంధనతో డిజిటల్ చెల్లింపుల వినియోగం భవిష్యత్లో సైతం పెరగనుంది. అయితే, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రూపంలో వల విసిరి అమాయకుల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిపోతున్నారు. కొందరు విద్యావంతులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో సైబర్, బ్యాంకింగ్ రంగ నిపుణులు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
సైబర్ మోసగాళ్లకు బ్యాంకు లింకుల పేరిట సందేశాలు పంపి డబ్బులు కాజేయడం ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోయింది. మీ ఫోన్కు వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే అవి మీ డిఫాల్ట్ యూపీఐ యాప్కు రీడైరెక్ట్ అవుతాయి. అది ఆటో డెబిట్కు పర్మిషన్ అడుగుతుంది. ఒకవేళ మీరు పొరపాటున ఇస్తే సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలో నగదును క్షణాల్లో మాయం చేసేస్తారు.
ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు నేరుగా పేమెంట్స్ కోసం ‘రిక్వెస్ట్ మనీ’ పేరిట లింకులను పంపుతున్నారు. ఆ లింకు క్లిక్ చేస్తే మనకు నగదు వస్తుందని భ్రమ పడి యూపీఐ పిన్ నంబర్ను ఇవ్వడం ద్వారా రావడం మాట అటుంచితే ఖాతాలో మీ నగదు మాయం కావడం ఖాయం.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అధికారుల మాదిరిగా ఫోన్ చేసి వెరికేషన్ కోసం థర్డ్పార్టీ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పొరపాటున మీరు ఆ యాప్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే దొంగ చేతికి మీరే స్వయంగా తాళాలు అందించినట్లే. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్ రిమోట్ యాక్సెస్ అవతలి వ్యక్తికి చేతికి వెళ్లిపోతుంది.
also read రిలయన్స్ రైట్స్ మెరుపులు.. ప్రిపెయిడ్ కస్టమర్లకు జియో షాక్.. ...
ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్కు సంబంధించిన యాప్స్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ అడిగిన పర్మిషన్లన్నీ ఇస్తే మీ ఫోన్ లోని సమాచారం సైబర్ నేరగాడికి చిక్కుతుంది.
బ్యాంకింగ్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆయా బ్యాంకుల అధికారిక వెబ్సైట్కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు యాప్లను పోలిన డూప్లికేట్ యాప్లు పుష్కలంగానే ఉన్నాయి. అలాంటివి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం.
అలాగే ఆయా బ్యాంక్ సేవలకు సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్లను నెట్టింట శోధించడం మంచిది కాదు. మీకు ఏ బ్యాంక్ నంబర్ కావాలో ఆ బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్లి అక్కడి నంబర్కు ఫోన్ చేయడం మంచి పద్ధతి. యూపీఐ పిన్ గానీ, ఓటీపీ గానీ ఇంకో వ్యక్తికి చెప్పకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో చిరు వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులను స్వీకరించడానికి ముందుకు వస్తున్నారని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ తెలిపారు. వీటితోపాటు సైబర్ నేరాలు పెరిగాయని, పొరపాటున కూడా వినియోగదారులు తమ యూపీఐ పిన్ నంబర్ బయటి వ్యక్తులకు చెల్లించొద్దన్నారు.
యూపీఐ చెల్లింపుల ద్వారా గరిష్ఠంగా రూ.లక్ష వరకు చెల్లించవచ్చునని, బీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో ఇది పెరుగుతుందన్నారు. వ్యాపారులు తమ వినియోగదారులకు ఎస్సెమ్మెస్ పేమెంట్ లింక్ పంపి చెల్లింపులను స్వీకరించడానికి పలు కొత్త సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. వీటన్నింటికీ యూపీఐ ఫ్లాట్ ఫామే ఆధారమని ప్రవీణా రాయ్ తెలిపారు.