బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... కరోనా ‘ఎఫెక్ట్’ మామూలుగా లేదు..
కరోనా మహమ్మారి పుణ్యమా? అని మున్ముందు అన్నిరంగాల పరిశ్రమలు ఇంటి నుంచే పని చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో ఈ విధానం అమలులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో కొద్ది మంది మాత్రమే శాఖలకు వచ్చి విధులు నిర్వర్తించగా, మిగతా వారు తమ ఇళ్ల వద్ద నుంచే డ్యూటీలు పూర్తి చేశారు.
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల అనివార్యంగా చాలా పరిశ్రమలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా ఆదేశించాయి. సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమల్లో ఎప్పటినుంచో ఈ పోకడ ఉంది. ఆర్థిక, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ అవకాశమే లేదు. అయితే లాక్డౌన్ వల్ల తక్కువ మందితోనే బ్యాంకులు నడిచాయి. మిగతా సిబ్బంది మాత్రం ఇంటి నుంచే పనిచేశారు.
ఇంటి నుంచి పనిచేయడం వల్ల బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సిబ్బంది ప్రొడక్టివిటీ పెరిగిందని తెలిసింది. ట్రాఫిక్లో గంటల తరబడి ప్రయాణాల లేకపోవడం వల్ల ఉద్యోగులు చురుగ్గా పనిచేశారని సమాచారం. ‘జెఫరీస్ ఇండియా’నే తీసుకుంటే సగటున 60 మంది రోజుకు ఒక గంటను ఆదా చేశారు. 70 శాతం మంది పనితీరు మరింత పెరిగిందని ఆ సంస్థ తెలిపింది.
also read పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మళ్ళీ పెంపు...లీటరు ఎంతంటే ? ...
భారత్లో ఆర్థిక రంగ సంస్థలన్నీ ముంబై కేంద్రంగా పనిచేస్తుంటాయి. దేశంలో కరోనా వైరస్ బెడద ఎక్కువగా ఉన్నది అక్కడే. అందుకే బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు పనితీరులో శాశ్వత మార్పులు తీసుకు వచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి. 70-90 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి.
ఈ విధానంతో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం వచ్చిందని పరాగ్ పారిక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ సీఈవో నీల్ పారిఖ్ తెలిపారు. భవిష్యత్తులోనూ వారంలో 2-3 రోజులు బృందాల వారీగా ఇంటి నుంచే పని చేయించడంపై సంస్థలు దృష్టి సారిస్తున్నాయని వెల్లడించారు. ఉద్యోగులు ఇంటి నుంచి ఎలా పనిచేస్తారోనన్న ఆందోళన మాయమైందన్నారు.
సమీప భవిష్యత్తులో కరోనా ముప్పు తగ్గే అవకాశం లేకపోవడం వల్ల భౌతికదూరం పాటించేందుకు రిలయన్స్ సెక్యూరిటీస్ కూడా ఇదే బాటలో పయనించనుందని తెలిసింది. ముంబై కరోనా రెండో దశ ప్రభావం ముంచుకు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ తమకేమీ ఆందోళన లేదని ఆర్థిక సంస్థలు అంటున్నాయి. మున్ముందు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేయడం సరికొత్త సాధారణం కానుందని భావిస్తున్నారు.