బ్యాంకులకు మోసం విలువ రూ.71,500 కోట్లు: ఆర్బీఐ వెల్లడి
గత ఆర్థిక సంవత్సరం 2018-19లో బ్యాంకుల్లో మోసాల వల్ల నష్టపోయిన సొమ్ము విలువ రూ.71,500 కోట్లని తేలింది. 2017-18తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం మోసాల విలువ రెట్టింపైందని ఆర్బీఐకి బ్యాంకులు తెలిపాయి.
ముంబై: డబ్బులతోపాటు వెంట మోసం కూడా ఉంటుంది. బ్యాంకులకు బురిడీ కొట్టించే వాళ్లూ ఉంటారు. అది చిన్న మోసం కాదంటే నీరవ్ మోదీ తరహాలో పెద్ద మోసం కావొచ్చు. ఏదేమైనా చివరకు నష్టపోయేది బ్యాంకులు.. వాటిలో డబ్బులు ఉంచుకునే సామాన్యులే.
గత ఆర్థిక సంవర్సరంలో 6800 బ్యాంక్ మోసాల కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు రూ.71,500 కోట్ల మేర పోగొట్టుకున్నట్లు బ్యాంకులు ఆర్బీఐకిచ్చిన నివేదికలో స్పష్టం చేశాయి. వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థల్లో ఈ మోసాలు జరిగాయి.
2017-18లో బ్యాంకు మోసాలపై 5,961 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఇందులోని మోసాల విలువ రూ.41,167.03 కోట్లుగా ఉంది. వీటితో పోలిస్తే 2018-19లోని మోసాల విలువ 73 శాతం ఎక్కువ. ఈ విషయాలన్నీ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలు చేసుకోగా బయటపడ్డాయి.
గత 11 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం బ్యాంకు మోసాలపై 53,334 కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ కేసుల్లోని మొత్తం రూ.2.05 లక్షల కోట్లుగా ఉంది. వీటిలో అత్యధికంగా నష్టపోయింది మాత్రం గతేడాదే. కేసుల సంఖ్యా ఎక్కువే.
తొలిసారిగా 2013-14లో రూ.10,000 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగాన అధిగమించిన కేసులు 5000 ఉన్నాయి.
బ్యాంకులు ఆయా వ్యక్తులు లేదా సంస్థలపై నమోదు చేయాల్సిన క్రిమినల్ ఫిర్యాదుల వివరాలను వెల్లడించిన ఆర్బఐ ఇప్పటికే చర్యలు తీసుకున్న, తీసుకుంటున్న గణాంకాలను మాత్రం వెల్లడించలేదు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారు దేశాలను వదిలి వెళ్లిన నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అతిపెద్ద 100 కేసులు/మోసాలపై కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) విశ్లేషిస్తోంది. మోసం జరిగిన తీరు, మోసం చేసిన మొత్తం, రుణంలో రకం, మోసానికి తోడ్పడిన లోపాలు వంటి వాటిని విశ్లేషించి.. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలన్నది దీని వెనక ఉన్న ఉద్దేశం.
ఈ మోసాలు మొత్తం 13 రంగాల్లో జరిగినట్లు తెలుస్తోంది. రత్నాభరణాలు, తయారీ-పరిశ్రమ, వ్యవసాయం, మీడియా, విమానయానం, సేవలు-ప్రాజెక్టులు, చెక్కులు, ట్రేడింగ్, ఐటీ, ఎగుమతి వ్యాపారం, స్థిర డిపాజిట్లు, డిమాండ్ రుణాలు, లెటర్ ఆఫ్ కంఫర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఐడీబీఐ కేసులో జరిగిన రూ.600 కోట్ల రుణం మోసం కేసులో సీబీఐ 2018లో ఇద్దరు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐడీబీఐ బ్యాంక్ మాజీ సీఎండీ, ఎయిర్సెల్ మాజీ ప్రమోటర్ సి. శివశంకరన్, ఆయన కుమారుడు, కంపెనీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2010-2014 మధ్య ఐడీబీఐలో పనిచేసిన 15 మంది సీనియర్ అధికారులపై దర్యాప్తు చేస్తోంది. సీవీసీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.