దేశీయ బ్యాంకింగ్ రంగం ఉలిక్కి పడేలా మరో బ్యాంకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. గతంలో Punjab National Bank కుంభకోణం తరహాలోనే ఈ సారి,  మరో పెద్ద బ్యాంకు కుంభకోణం తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణంలో 17 బ్యాంకులు మొత్తం రూ.34,615 కోట్ల మేర మోసపూరితంగా నష్టపోయాయి.  

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) మాజీ ఛైర్మన్ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ సహా ఆరు రియల్టీ రంగ కంపెనీలపై కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.34,615 కోట్ల మేర మోసగించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.

ఫిబ్రవరి 11, 2022న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ చర్య తీసుకుంది. వాధ్వాన్ సోదరులు ప్రస్తుతం అవినీతి కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. కేసు నమోదు అనంతరం 50 మందికి పైగా సీబీఐ అధికారుల బృందం ముంబైలోని నిందితుల 12 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే...?
వివిధ పద్దతుల్లో  2010 నుంచి 2018 మధ్య కాలంలో బ్యాంకుల కన్సార్టియం నుంచి కంపెనీ రూ.42,871 కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్టర్ గా మిగిలిపోయింది. దీంతో  రుణాలిచ్చిన బ్యాంకులు వివిధ సమయాల్లో కంపెనీ ఖాతాలను ఎన్‌పీఏలుగా ప్రకటించాయి. జనవరి 2019లో దర్యాప్తు ప్రారంభమైన తర్వాత, ఫిబ్రవరి 2019లో రుణదాతల కమిటీ ఏప్రిల్ 1, 2015 నుండి డిసెంబర్ 31, 2018 వరకు DHFL యొక్క ప్రత్యేక సమీక్ష ఆడిట్ నిర్వహించడానికి KPMGని నియమించింది.

డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లతో సమానంగా ఉన్న 66 సంస్థలకు రూ.29,100.33 కోట్లు ఇచ్చినట్లు ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఇందులో రూ.29,849 కోట్లు బకాయిలు ఉన్నాయి. బ్యాంకు నుండి తీసుకున్న డబ్బును సంస్థలు, వ్యక్తులు భూముల కొనుగోలు, ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టారని బ్యాంకు ఆరోపించింది.