అమ్మ బాబోయ్!! అమ్రపాలీతో ధోనీ సీక్రెట్ డీల్స్?
- ధోని బ్రాండ్ల ప్రమోటర్ సంస్థ ‘రితి స్పోర్ట్స్’ తో ఆమ్రపాలి చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు సుప్రీంకోర్టుకు ధర్మాసనం నియమించిన ఆడిటర్లే తెలిపారు.
- అమ్రపాలీ మహీ డెవలపర్స్ సంస్థలో సాక్షి ధోనీకి 25 శాతం వాటాలు ఉన్నాయని ఆంగ్ల మీడియాలో వార్తలొచ్చాయి.
- కానీ తమకే పాపం తెలియదని రితీ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదార్లకు చెందిన డబ్బును చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్(ఆర్ఎస్ఎమ్పీఎల్)తో ఆమ్రపాలి గ్రూప్ ‘చీకటి ఒప్పందాల’ను కుదుర్చుకుంది. సుప్రీం కోర్టుకు కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లే ఈ సంగతి తెలిపారు. తెలిపారు. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్లకు ఈ కంపెనీ ప్రచారం కల్పిస్తుంటుంది. ధోనీతో పాటు భువనేశ్వర్, డుప్లిసిస్, ప్రజ్ఞాన్ ఓజాలతో పాటు ఇతర స్పోర్ట్స్ స్టార్లకు ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తుంటుంది.
‘2009-2015 మధ్య ఆర్ఎస్ఎమ్పీఎల్కు మొత్తం రూ.42.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆమ్రపాలి సఫైర్ డెవలపర్స్ రూ.6.52 కోట్లు మాత్రమే చెల్లించింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎమ్పీఎల్తో పలు ఒప్పందాలను ఆమ్రపాలి గ్రూప్ కుదుర్చుకుంది. అందులో 2009 నవంబర్ 22న జరిగిన ఒక ఒప్పందానికి ఆర్ఎస్ఎమ్పీఎల్ ప్రతినిధితో కలిసి ధోని కూడా హాజరయ్యారు’ అని సుప్రీంకోర్టుకు ఆడిటర్లు తెలిపారు.
‘ఎటువంటి పత్రాలు లేకుండా జరిగిన ఈ ఒప్పందాలన్నీ ఆర్ఎస్ఎమ్పీఎల్కు చెల్లింపులు చేయడానికి మాత్రమే జరిగాయని స్పష్టమవుతోంది. ఇక్కడ గృహ కొనుగోలుదార్లకు చెందిన డబ్బును చట్టవ్యతిరేకంగా ఆర్ఎస్ఎమ్పీఎల్కు చెల్లించారు. ఆ ఒప్పందాలు చట్టబద్ధం కావు కాబట్టి ఆ డబ్బులను రికవరీ చేయించాలి’అని సుప్రీంకోర్టుకు ఆడిటర్లు వివరించారు.
జస్టిస్లు అరుణ్ మిశ్రా, యూయూ లలిత్ వెలువరించిన 270 పేజీల తీర్పులో ఈ విషయాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ ఆడిటర్లు తెలిపారు. ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులో పదేళ్ల క్రితం బుక్ చేసుకున్న 5500 చ.అడుగుల పెంట్హౌస్ యాజమాన్య హక్కులకు రక్షణ కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్లో ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
‘ఐపీఎల్ 2015లో చెన్నై సూపర్కింగ్స్ జట్టు మ్యాచ్ ఆడుతున్న ప్రదేశాల్లో లోగోను ప్రదర్శించడానికి ఆర్ఎస్ఎమ్పీఎల్తో ఆమ్రపాలి గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. అది కేవలం ఆమ్రపాలి, రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మధ్య జరిగిన ఒప్పందం అంటూ ఒక సాధారణ కాగితంపై ఉంది. ఎటువంటి సంతకాలు లేవ’ని నివేదిక స్పష్టం చేసింది.
కాగా, ఆమ్రపాలి ధోని డెవలపర్స్లో సాక్షి సింగ్ ధోని ఒకప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. అప్పట్లో ఆమ్రపాలి గ్రూప్నకు ధోని బ్రాండ్ అంబాసిడర్గానూ పనిచేశారు. కాగా, చెప్పిన సమయానికి ఫ్లాట్లు అప్పగించకుండా వేలమంది కొనుగోలుదార్లను ఇబ్బంది పెడుతున్న ఆమ్రపాలి గ్రూప్ రిజిస్ట్రేషన్ను రెరా చట్టం కింద సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
కానీ అమ్రపాలీ సంస్థతో తాము అనవసర తప్పిదాలకు పాల్పడలేదని ఎంఎస్ ధోనీ సారథ్యంలోని రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అమ్రపాలీ వ్యవహారాల్లో ధోనీ చీకటి ఒప్పందాలను చేసుకున్నట్లు ఆడిటర్లు తెలిపిన సంగతి తెలిసిందే. గమ్మత్తేమిటంటే అమ్రపాలీ మహీ డెవలపర్స్ సంస్థలో మహీంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షికి 25 శాతం వాటాలు ఉన్నాయని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. 2014 సెప్టెంబర్ నాటి రికార్డుల ప్రకారం మిగతా 75 శాతం అమ్రపాలీ సీఎండీ అనిల్ కుమార్ శర్మదని తెలుస్తోంది.