వినోద రంగ ప్రదాతలు అంబానీ బ్రదర్స్.. మాస్ ఫాలోయింగ్లో సల్మాన్, రజనీ బెస్ట్
వ్యాపార, వాణిజ్య రంగాల్లో రిలయన్స్ అంబానీ బ్రదర్స్ది అందెవేసిన చేయి. తండ్రి దీరుభాయి అంబానీ మరణించిన తర్వాత కొద్ది కాలానికి ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ విడిపోయినా ప్రస్తుతం అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.
న్యూఢిల్లీ: వినోద రంగంలో అత్యంత ప్రభావవంతమైన 500 వ్యక్తుల జాబితాలో బిలియనీర్లు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ నిలిచారు. వినోద రంగంపై వెరైటీ మ్యాగజైన్ ప్రచురించిన టాప్-500 ప్రభావవంతమైన వ్యాపారవేత్తల జాబితాలో వీరు చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు, బాలీవుడ్ నటులు సల్మాన్ఖాన్, ప్రియాంక చోప్రా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరిగే రంగాల్లో వినోదం కూడా ఒకటి. ప్రస్తుతం వినోద రంగంలో రెండు లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్లకు మాస్ పాలోయింగ్ ఎక్కువ.
ఇక భారత్ సినీ ప్రముఖుల్లో కరణ్జోహార్, స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, యశ్రాజ్ ఫిల్స్మ్ ఆదిత్య చోప్రా, బాలాజీ టెలీ ఫిల్స్మ్ ఏక్తా కపూర్, జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునిత్ గోయెంకె, ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు చెందిన సిద్ధార్థ కపూర్ ఉన్నారు.
‘వినోద రంగాన్ని రెండు లక్షల కోట్ల డాలర్లకు చేర్చడంలో తమవంతు పాత్ర పోషించిన టాప్-500 ప్రభావవంతమైన వ్యాపారవేత్తల జాబితా ఇది’ అని వెరైటీ మ్యాగజైన్ వెబ్సైట్ పేర్కొంది. ఈ జాబితాలో వాల్ట్ డిస్నీ కంపెనీ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ లెగర్ అగ్రస్థానంలో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘స్టార్వార్స్’ను రూపొందించిన లూకాస్ ఫిల్స్మ్ను 2012లో 4.05 బిలియన్ డాలర్లకు, 2009లో 4బిలియన్ డాలర్లకు మార్వెల్ను, అంతకుముందు 2006లో 7.4 బిలియన్ డాలర్లకు పిక్సర్ యానిమేషన్ను వాల్ట్ డిస్నీ దక్కించుకోవడంలో రాబర్ట్ కీలక పాత్ర పోషించారు.
ఆయన తర్వాత వాండా మీడియా గ్రూప్ ఛైర్మన్ జైన్ లిన్ వాంగ్, నటుడు, నిర్మాత బ్రాడ్లీ కూపర్, సోనీ కార్పొరేషన్ ఛైర్మన్ కాజ్ హిరాయ్, రచయిత జేకే రౌలింగ్, నెట్ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ శాండ్రస్, పాప్ స్టార్ బేవన్స్, రచయిత-దర్శకుడు ప్యాటీ జెకిన్స్, అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత మీగల్ ఎల్లిసన్, యూట్యూబ్ సీఈవో సుశాన్ ఓజెకీకీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
దశాబ్దాలుగా ఖాన్ త్రయం బాలీవుడ్ను ఏలుతోందని ఆమీర్, షారుఖ్లతో పోలిస్తే, సల్మాన్కు కాస్త మాస్ ఫాలోయింగ్ ఎక్కువని వెరైటీ పేర్కొంది. ఆల్టైమ్ టాప్ టెన్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో సల్మాన్, షారుఖ్ల చిత్రాలు మూడేసి ఉండగా, ఆమీర్ ఖాతాలో నాలుగు ఉన్నట్లు తెలిపింది. సల్మాన్ చిత్రాలు విడుదలయ్యే సమయంలో భారీ అంచనాలు ఉంటాయి. మళ్లీ అదే స్థాయి అంచనాలు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు ఉంటాయని తెలిపింది.
జియో ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ముఖేష్ అంబానీ 30 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టారని, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇదీ ఒకటని వెరైటీ తెలిపింది. జియో రాకతో డిజిటల్ వేదికగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నది. ‘భారత్లో ఇంటర్నెట్ అనుసంధానం చాలా లోపభూయిష్టంగా ఉండేది.
కేవలం 200మిలియన్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తుండగా, 800 మిలియన్ల మంది మొబైల్స్ ద్వారా నెట్ను వినియోగిస్తున్నారు. పైగా డేటా ఖరీదు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో జియో విప్లవాత్మక మార్పును తెచ్చింది. వేగవంతమైన డేటాను అందుబాటులోకి తేవడమే కాక, ఈ విషయంలో పోటీ సంస్థలు కూడా దిగి వచ్చేలా చేసింది’ అని వెరైటీ తెలిపింది.
ఇక అంబానీల మరో సోదరుడు అనిల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా వివిధ సినిమాలను నిర్మించారని తెలిపింది. ఇందులో భాగంగానే 2005లోనే యాడ్ల్యాబ్స్ను కొనుగోలు చేసినట్లు వివరించింది. సినిమా పంపిణీ, ప్రాసెసింగ్ వ్యాపారంలో అనిల్ అంబానీ తనదైన ముద్ర చూపిస్తున్నారని పేర్కొంది.