ఎయిర్ ఇండియా సంస్థ ఓ భారీ డీల్ చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. సుమారు 300 విమానాల‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌మ‌ర్షియ‌ల్ ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఇది అత్యంత పెద్ద డీల్ అని భావిస్తున్నారు. కానీ ఈ డీల్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇంకా గోప్యంగా ఉంచారు. 

ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్‌లను ఆర్డర్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఆర్డర్‌లలో ఇది ఒకటి కావచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది, గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్‌లైన్ కొత్త యాజమాన్యం కింద సరికొత్త నిర్ణయాలతో శరవేగంగా ముందుకు సాగుతోంది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది. క్యారియర్ ఎయిర్‌బస్ SE-A320neo ఫ్యామిలీ జెట్‌లను లేదా బోయింగ్ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ మోడల్‌ విమానాలను లేదా రెండింటినీ ఆర్డర్ చేయవచ్చని తెలుస్తోంది. చర్చలు గోప్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 300.. 737 మ్యాక్స్-10 జెట్‌ల కోసం జరుగుతున్న ఈ డీల్ విలువ సుమారు 40.5 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ ఇటువంటి పెద్ద కొనుగోళ్లలో డిస్కౌంట్స్ అనేది సాధారణం.

బోయింగ్ సంస్థకు ఈ ఆర్డర్ చాలా కీలకమైనదిగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎయిర్ బస్ కంపెనీ విమానాలు దేశంలో ఆకాశంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కరోనాకి ముందు భారత విమానయాన పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ఇండిగో కూడా నారోబాడీ విమానాలకు అతిపెద్ద కస్టమర్ గా ఉంది. ఇదే సమయంలో విస్తారా, గో ఎయిర్‌లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్‌ఏషియా ఇండియా లిమిటెడ్‌తో సహా ఇతర సంస్థలు ఈ మోడళ్లకు సంబంధించిన విమానాలనే నడుపుతున్నాయి. 300 విమానాల తయారీ, డెలివరీకి సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎయిర్‌బస్ ఒక నెలలో దాదాపు 50 నారోబాడీ జెట్‌లను నిర్మిస్తోంది. 2023 మధ్య నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 65కి, 2025 నాటికి 75కి పెంచేందుకు ప్రణాళికలు చేస్తోంది.

ఎయిర్ ఇండియా కొత్త యజమాని టాటా గ్రూప్ కూడా న్యూ ఢిల్లీ నుంచి అమెరికాలోని వెస్ట్ కోస్ట్ వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉన్న Airbus- A350 లాంగ్-రేంజ్ జెట్‌ల కోసం ఆర్డర్‌కి దగ్గరగా ఉందని బ్లూమ్‌బెర్గ్ సంస్థ నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఎయిర్‌లైన్ ఇప్పటికీ చాలా ప్రధాన విమానాశ్రయాల్లో లాభదాయకమైన ల్యాండింగ్ స్లాట్‌లను కలిగి ఉంది. అయితే ఇది భారతదేశానికి నాన్‌స్టాప్ సేవలతో పాటు మధ్యప్రాచ్యంలోని హబ్‌ల ద్వారా ప్రయాణించే క్యారియర్‌లతో పాటు విదేశీ విమానయాన సంస్థల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రైవేటీకరణలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో టాటా గ్రూప్ నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసింది. నాలుగు ఎయిర్‌లైన్ బ్రాండ్‌లను కలిగి ఉన్న టాటా గ్రూప్ వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని చూస్తోంది. కొత్త విమానాల కోసం ఒక ఆర్డర్.. ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణపై అనుకూలమైన నిబంధనలతో, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లోని ఇతర ప్రత్యర్థులతో పోటీ పడేందుకే ఈ భారీ డీల్ చేసుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని వల్ల ఎయిర్ ఇండియా వాటికి మెరుగైన పోటీని ఇచ్చేందుకు ఉపకరిస్తుందని వారు అంటున్నారు.