Budget 2025 : నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ అరుదైన ఘనత సాధించబోతున్నారు. అయితే తాత, తల్లి, మనవడు...ఇలా ఒకే కుటుంబంనుండి ముగ్గురికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. ఈ ఘనత సాధించిన ఆ కుటుంబమేదో తెలుసా?
Union Budget : బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెడతారు... కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా ఆర్థిక మంత్రులే ఈ పని చేసేది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర బడ్జెట్ ను స్వయంగా ప్రధానమంత్రులే ప్రవేశపెట్టారు. ఈ అరుదైన అవకాశం కూడా ఒకే కుటుంబానికి చెందినవారికి దక్కింది. ఇలా ప్రధానులుగా వుండి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం చేసిన ప్రధానుల గురించి తెలుసుకుందాం.
1. జవహార్లాల్ నెహ్రూ :
స్వాతంత్య్ర భారత దేశానికి తొలి ప్రధానమంత్రిగా వ్యహరించారు జవహార్లాల్ నెహ్రు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానిగా వుంటూనే అనుకోని పరిస్థితుల్లో రెండుసార్లు ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి వచ్చింది.దీంతో ఓసారి ఆయన ఆర్థికమంత్రి హోదాలో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
1956 లో దాదాపు నెలరోజులపాటు ఆర్థికమంత్రిగా వ్యవహరించారు నెహ్రూ. ఆ తర్వాత 1958 లో ఓసారి ఇలాగే మరో నెలరోజులు ఆర్థిక మంత్రిగా పనిచేసారు. రెండోసారి సరిగ్గా బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు... దీంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు.
1958లో ముంద్రా కుంభకోణం సంచలనం సృష్టించింది. దీంతో ఆనాటి ఆర్థికమంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామా చేసారు. దీంతో 1958 ఫిబ్రవరి 13 నుండి మార్చి 13 వరకు నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలు చూసుకున్నారు.
2. ఇందిరా గాంధీ :
తన తండ్రి నెహ్రూ లాగే భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీకి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. ఆమె మంత్రివర్గంలోని మొరార్జీ దేశాయ్ రాజీనామాతో ప్రధానిగా వుంటూనే ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూసుకున్నారు ఇందిరా గాంధీ. ఇలా 1970-71 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారు.
3. రాజీవ్ గాంధీ :
తాత, తల్లి మాదిరిగానే రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా అత్యున్నత పదవిని అధిరోహించారు. ఈ క్రమంలో వారి మాదిరిగానే ఆయనకూ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. ఆయన కేబినెట్ లోని ఆర్థికమంత్రి విపి సింగ్ రాజీనామా చేయడంతో 1987-88 ఆర్థిక సంవత్సరాని దేశ బడ్జెట్ ను రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు.
ఇలా దేశానికి ప్రధానిగా పనిచేసే అవకాశమే కాదు ఆర్థిక మంత్రులుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా గాంధీ కుటుంబానికి దక్కింది. తాత, తల్లి, మనవడు ముగ్గురికీ ఈ అరుదైన అవకాశం దక్కడం విశేషం. గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాలు ప్రధానులుగా పనిచేసారని అందరికీ తెలుసు... కానీ ఆర్థికమంత్రులుగా పనిచేసే అవకాశం కూడా వారికి దక్కిందని, స్వయంగా పార్లమెంట్ లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారని మాత్రం చాలామందికి తెలియదు.
