నేటి కార్ల ‘ఆవిష్కరణ’ల కనువిందు.. వెహికిల్స్ మార్కెట్ మళ్లీ బిజీబిజీ..
దేశంలోకి కరోనా మహమ్మారి కాలుమోపిన తర్వాత కళా విహీనమైన ఆటోమొబైల్ మార్కెట్ మళ్లీ కొత్త కళను సంతరించుకోబోతోంది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు కార్ల తయారీ సంస్థలు తమ నూతన మోడల్ కార్లను ఆవిష్కరించి కనువిందు చేయనున్నాయి
న్యూఢిల్లీ: దేశంలోకి కరోనా మహమ్మారి కాలుమోపిన తర్వాత కళా విహీనమైన ఆటోమొబైల్ మార్కెట్ మళ్లీ కొత్త కళను సంతరించుకోబోతోంది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు కార్ల తయారీ సంస్థలు తమ నూతన మోడల్ కార్లను ఆవిష్కరించి కనువిందు చేయనున్నాయి. ఏకంగా ఏడు కొత్త కార్లు విఫణిలోకి రాబోతున్నాయి. వీటిలో చాలా వరకు వర్చువల్ వేదికల ద్వారా ఆవిష్కరించనున్నరు.
ఆటో ఎక్స్పో 2020లో తళుక్కుమన్న హ్యుండాయ్ టుక్సన్ 2020 కారు ఈ నెల 14వ తేదీన వర్చువల్ ఈవెంట్ ద్వారా మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. నిజానికీ ఎస్యూవీ ఇంతకుముందే విడుదల కావాల్సి ఉన్నా కరోనా వైరస్ కారణంగా లాంచింగ్ ఆలస్యమైంది.
హోండా కార్స్ ఇండియా తన ఫ్లాగ్షిప్ సెడాన్ ‘సిటీ 2020-హోండా సిటీ’ మోడల్ కారును ఈ నెల 15న విపణిలో ఆవిష్కరిస్తోంది. ఐదో తరం సెడాన్ అయిన ఇది ఈ ఏడాది మొదట్లోనే విడుదల కావాల్సి ఉన్న కొవిడ్ సవాళ్ల కారణంగా వాయిదా పడింది. మారుతి సుజుకి సియాజ్, హ్యుండాయ్ వెర్నా వంటి వాటికి ఇది గట్టిపోటీ ఇస్తుందని తెలుస్తోంది.
సోమవారం విడుదల కానున్న 6 సీటర్ అయిన ఎస్యూవీ కారు ఎంజీ హెక్టార్ ప్లస్ కోసం రూ. 50 వేలతో అడ్వాన్స్ బుకింగులు కూడా ప్రారంభమయ్యాయి. టాటా గ్రావిటాస్, త్వరలో విపణిలో అడుగు పెట్టనున్న హ్యుండాయ్ క్రెటా 7 సీటర్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్ బ్యాక్ మోడల్ కారును ఈ నెల 16వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఆడి ఇప్పటికే ప్రకటించింది. 5 సీటర్ కారు అయిన ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్బ్యాక్కు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది రెండోతరం కారు. ఇది మరింత మెరుగైన పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆగస్టు నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. దీని ప్రారంభ ధర రూ.10 లక్షల నుంచి మొదలవుతుంది.
ఈ నెల 14వ తేదీన ఐఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ వెహికల్ ఆవిష్కరణకు బీఎండబ్ల్యూ సిద్ధమైంది. ఇది ఐదో తరం బీఎండబ్ల్యూ ఈడ్రైవ్ టెక్నాలజీతో వస్తోంది. వీటిలో ఎలక్ట్రిక్ ఇంజన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్మిషన్తో కూడిన డ్రైవ్ యూనిట్ సెంట్రల్ హౌసింగ్తో ఉంది.
కరోనా కారణంగా చాలా ఆలస్యమైన నిస్సాన్ అరియా ఎస్యూవీ ఎట్టకేలకు లాంచింగ్కు సిద్ధమైంది. ఈ నెల 15న దీనిని విడుదల చేయబోతున్నట్టు జపానీస్ కార్ మేకర్ నిస్సాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. అరియా ఎలక్ట్రిక్ ఎస్యూవీ మాత్రం 2021లో రానుంది.
ఈ నెల 13వ తేదీన సోమవారం ఫోర్డ్ బ్రోంకో ఎస్యూవీ విడుదల కాబోతోంది. నిజానికి ఈ కారు ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉండగా, వివిధ కారణాల కారణంగా వాయిదా పడింది. తాజాగా, ఫోర్డ్ బ్రోంకో 4X4ను సోమవార విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.