మార్కెట్లోకి 21న మారుతి న్యూ ఎర్టిగ: ఫ్రీ బుకింగ్ స్టార్ట్
ఈ నెల 21వ తేదీన మారుతి సుజుకి నూతన తరం ఎర్టిగ మోడల్ కారును వినియోగదారుల ముంగిట్లోకి తేనున్నది. అందుకోసం రూ.11 వేలు చెల్లించి ఫ్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. పాత ఎర్టిగ కారుతో పోలిస్తే నూతన మోడల్ కారు ఏడు సీట్లతోపాటు స్పేసియస్గా ఉంటుంది.
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి న్యూ వర్షన్ మల్టీ పర్పస్ (ఎంవీపీ) ఎర్టిగ మోడల్ కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మారుతి ఎరీనా షోరూమ్ల్లో ప్రారంభ చెల్లింపుల్లో భాగంగా రూ.11 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సెవెన్ సీటర్ ఎంవీపీ కారును ఈ నెల 21వ తేదీన ప్రారంభించేందుకు మారుతి సుజుకి (ఎంఎస్జడ్) సంసిద్ధమవుతోంది.
అంతే కాదు పెట్రోల్ (1.5 లీటర్లు), డీజిల్ (1.3 లీటర్ల) వేరియంట్ ఇంజిన్లతోపాటు నాలుగు వేరియంట్లు, రంగుల్లో వినియోగదారుల ముందుకు రానున్నది. వైబ్రేషన్స్, శబ్ధంతోపాటు భద్రతను పెంపొందించే లక్ష్యంగా హార్ట్ టెక్ వేదికగా మారుతి సుజుకి మేనేజ్మెంట్ రూపొందించిన కాన్సెప్ట్ ప్రకారమే నూతన తరం మారుతి ఎర్టిగ మోడల్ కారు సిద్ధమైంది.
పాతతరం ఎర్టిగతో పోలిస్తే నూతన తరం ఎర్టిగ మోడల్ కారు పెద్దదిగా ఉంటుంది. పొడవుగానూ, స్పేసియస్గానూ ఉంటుంది. సియాజ్ మోడల్ కారులో మాదిరిగా కే 15 ‘1.5 లీటర్’ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్, 105 బీహెచ్పీ, 138 ఎన్ఎం టార్చి కూడా అందుబాటులో ఉన్నది. ఎస్హెచ్వీఎస్ హైబ్రీడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఇంజిన్ ఏర్పాటు చేశారు.
డీజిల్ వేరియంట్ మోడల్ న్యూ ఎర్టిగలో 1.3 లీటర్ల డీడీఐఎస్ 200 డీజిల్, 900 బీహెచ్పీ, 200 ఎన్ఎం టార్చి అమర్చారు. ఇందులో 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, లైసెన్స్ ప్లేట్పై క్రోమ్ ఔట్ లైనింగ్ కొత్తగా ఏర్పాటు చేశారు.
న్యూ సియాజ్ సర్వీస్ క్యాంపెయిన్ ప్రారంభించిన మారుతి సుజుకి
మారుతి సుజుకి తాను తయారు చేసిన నూతన తరం కారు ‘న్యూ సియేజ్’ మోడల్ కారు సర్వీస్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. డీజిల్ వేరయంట్ కారు స్పీడోమీటర్లో సమస్యలు తలెత్తడంతో వాటి స్థానే కొత్తవాటిని రీ ప్లేస్ చేయనున్నట్లు తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. జీటా, అల్ఫా వేరియంట్ మోడల్ కార్లలోనూ ఇప్పటికే మారుతి సుజుకి స్పీడో మీటర్లను రీ ప్లేస్ చేసే ప్రక్రియ గత నెలలోనే ప్రారంభించింది. ఈ మోడల్ ఏబీఎస్, సీల్ బెల్ట్ సరిగ్గా లేకపోవడంతో వాటిని మార్చేయనున్నది.