Asianet News TeluguAsianet News Telugu

30ఏళ్ళ తర్వాత భారతీయ మార్కెట్‌లోకి...ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలు

వచ్చే ఏడాది ఢిల్లీలో నిర్వహించే ఆటో ఎక్స్ పోలో ఎంట్రీ ఇచ్చేందుకు లాంబ్రెట్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం మిలాన్ నగరంలో రూపుదిద్దుకుంటున్నది. 30 ఏళ్ల తర్వాత భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తోంది. ఇటీవల మార్కెట్లో ప్రవేశించిన అలనాటి ‘జావా’ మోటార్ బైక్ ప్రీ బుకింగ్స్‌తో యువతో పాత తరం బైక్‌లపై మోజు పెరిగిందని తెలుస్తోంది. 

Lambretta To Go Electric At Auto Expo 2020
Author
Delhi, First Published Jan 16, 2019, 11:37 AM IST

న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం పాత బ్రాండ్ల ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ఒక వెలుగు వెలిగి.. కనుమరుగైన పాత బ్రాండ్స్‌ ఒక్కొక్కటి మళ్లీ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్‌ సైకిల్‌ ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా సుమారు 30 ఏళ్ల తర్వాత స్కూటర్‌ బ్రాండ్‌ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది.

ఉక్కుతో ఇండియన్ల కోసం ప్రత్యేకంగా..

లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి.. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నమూనాను ప్రదర్శిస్తామని తెలిపింది. భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్‌ లాంబ్రెటాను డిజైన్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్‌ లాంబ్రెటా డిజైనింగ్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

మిలాన్ లో రూపుదిద్దుకుంటున్న ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్

ఎక్స్‌పోలో ప్రదర్శించే లాంబ్రెటా ఎలక్ట్రిక్‌ స్కూటర్ ప్రస్తుతం మిలన్‌లో రూపుదిద్దుకుంటున్నది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్‌కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌) భారత్‌లో విక్రయించేది. 

ఇలా 1997లో పూర్తిగా స్కూటర్ల తయారీ నిలిపివేత

అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్‌ను విజయ్‌ సూపర్‌ పేరుతో, త్రిచక్ర వాహనాలను విక్రమ్‌ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్‌ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్‌ఐఎల్‌ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్‌ ఇండియాతో ట్రేడ్‌మార్క్‌ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది.  

లోహియా ఆటోతో జట్టు కట్టిన లాంబ్రెట్టా ఇన్నోసెంటీ

భారత్‌లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్‌ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్‌తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్‌కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది.

ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లపై ఫోకస్‌..

విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్‌ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్‌ డిజైన్‌లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అప్పట్లో బజాజ్‌ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యమేనా? అన్న సందేహాలూ ఉన్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్‌ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్‌ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి.

జావా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక స్ఫూర్తి

ఇటీవల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వింటేజ్‌ బ్రాండ్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా మంచి సక్సెస్‌ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మైలేజీతో సంబంధం లేకుండా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్యా గణనీయంగానే ఉంటోంది.  వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నా ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్‌లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనేది కొన్ని వర్గాల మాట!!

Follow Us:
Download App:
  • android
  • ios