వడివడిగా విస్తరణ : 300 పాయింట్లకు పైగా నెట్వర్క్ ఏర్పాటుకు కియా రెడీ
ఇటీవలే ‘సెల్టోస్’ మోడల్ కారును ఆవిష్కరించిన కియా మోటార్స్.. ప్రస్తుతం దేశీయ వాహనాల విక్రయాల్లో టాప్ 5 స్థానానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా నెట్ వర్క్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
న్యూఢిల్లీ: మన దేశంలో సేల్స్ నెట్వర్క్ను 300 టచ్పాయింట్స్కు పెంచాలని దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
also read వైండ్ షీల్డ్, రూఫ్, విండోస్ లేని మైక్ లారెన్స్ సూపర్ కారు
దేశీయ పాసింజర్ వాహనాల విక్రయంలో ఒకే ఒక్క మోడల్ కారును విపణిలోకి విడుదల చేసిన కియా మోటార్స్ ఇప్పటికే టాప్–5 ప్లేస్ సంపాదించుకుంది. చిన్న పట్టణాలు, నగరాలలో సేల్స్ అవుట్లెట్లు తెరవడం ద్వారా కస్టమర్లకు చేరువ కావాలనుకుంటున్నట్లు కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ వెల్లడించారు. ఇప్పటిదాకా 260 టచ్పాయింట్లు ఏర్పాటు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం చివరలోగా మరో 50 పెడతామని చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర తెలంగాణ, కర్నాటక, పశ్చిమ రాజస్థాన్లలో కొత్త టచ్పాయింట్స్ పెట్టనున్నట్లు కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ తెలిపారు. ముఖ్యంగా తాము పెద్దగా రాణించని ప్రాంతాల్లో షోరూములను ఏర్పాటు చేస్తామని మనోహ్ భట్ తెలిపారు. కొత్త ప్రొడక్ట్స్ వచ్చేలోపు సేల్స్ నెట్వర్క్ను పటిష్టం చేసుకుంటున్నట్లు చెప్పారు.
మల్టీ పర్పస్ వెహికిల్ కార్నివాల్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్పో సందర్భంగా లాంఛ్ చేయనుంది కియా మోటార్స్. రాబోయే మూడేళ్లలో ఆరు మోడల్స్ను ఇండియా మార్కెట్లో కి కంపెనీ తేనుంది. అంటే ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్ రానుంది. సెల్టోస్కు ప్రస్తుతం 62 వేల బుకింగ్స్ ఉన్నాయి. ఇప్పటికే 33 వేల సెల్టోస్ను కంపెనీ డెలివర్ చేసింది.
also read EICMA 2019: మోటో మోరిని నుంచి అడ్వెంచర్ బైక్
వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కారు కోసం వేచి ఉండటానికి పట్టే సమయం 3 నెలల దాకా ఉంటోందని కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వద్ద ప్లాంట్లో గతంలో నెలకు 6,500 యూనిట్లు తయారు చేస్తుండగా, ఇప్పుడు దానిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.