Asianet News TeluguAsianet News Telugu

మాస శివరాత్రి రోజున ఇలా చేస్తే.. కష్టాలన్నీ తీరుతాయి

మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి. దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.  శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి.

masa shivaratri importance
Author
Hyderabad, First Published Jul 30, 2019, 2:06 PM IST

ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి అంటే మాఘ మాస శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. మహా అనడానికి అర్థం ఇంతకంటే గొప్పది లేదు అని అర్థం.

మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి. దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.  శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి. దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు. తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

అసలు ఈ రోజున ఏం చేయాలి?

శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.

ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వ దళాలను శివునికి అర్పించాలి. ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.

ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.

కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు  చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios