జగన్, చంద్రబాబులతో కలిసే ప్రసక్తే లేదు: పవన్ కల్యాణ్
2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశానని, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. యువత నిరుద్యోగ భృతి కాదు...ఉపాధి కోరుతున్నారని, బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటోందని ఆయన అన్నారు.
ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన సోమవారం నాడు ప్రసంగించారు.
2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశానని, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. యువత నిరుద్యోగ భృతి కాదు...ఉపాధి కోరుతున్నారని, బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటోందని ఆయన అన్నారు. తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటికి భయపడే వ్యక్తిని కానని అన్నారు.
రాష్ట్రంలో దోపిడిరాజ్యం పోవాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు.. సోమవారం నెల్లూరు, బోగోలు ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. సాయంత్రం పొద్దుపోయాక బోగోలులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యే క హోదా ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా ప్రజల ను బీజేపీ మోసం చేస్తోందని విమర్శించారు.
విశాఖ రైల్వే జోన్ ముందుగా ప్రకటించి ఉంటే బీజేపీని అభినందిచేవారని, ఎన్నికల సమయంలో ప్రకటించడం రాజకీయ దురుద్దేశమేనని ఆయన అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు కొందరి అభివృద్ధినే చూస్తున్నారని, చట్టసభల్లో కొందరికి మాత్రమే స్థానం కల్పిస్తున్నారని ఆయన అన్నారు.
యువత మనోభావాలు బయటకు చెప్పుకోడానికి, వాటి సాధన కోసం జనసేనను ఒక ఆయుధంగా యువత స్వీకరించిందని పవన్ అన్నారు. 18-22 ఏళ్ల మధ్య ఉన్న యువతే ఎన్నికలను శాసిస్తుందని అభిప్రాయపడ్డారు. మొత్తం ఓటర్లలో 22 శాతం ఉన్న వీరు నీతివంతమైన భావి భారతాన్ని ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.