పార్టీలో ఎవరైనా చేరవచ్చు.. ఆ నిర్ణయం మాత్రం జగన్దే: వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల మార్పు, చేరికలు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్టుగా కాదని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల మార్పు, చేరికలు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్టుగా కాదని అన్నారు. నాయకుల అవసరం బట్టి వారిని మరో చోట వినియోగించుకోవాలనేదే పార్టీ ఆలోచన అని తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. వైసీపీలో ఎవరైనా చేరవచ్చు అని చెప్పారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 95 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని చెప్పారు.
పార్టీలో ఎవరూ చేరిన స్వాగతిస్తామని.. అయితే చేరికలతో ఏ మేరకు ప్రయోజనం ఉంటుందనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయని, ఎంతో మంది మంతనాలు జరుపుతుంటారని.. అయితే ఎవరిని పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకుంటారని చెప్పారు.
Also Read: చిరంజీవితో భేటీ కానున్న గంటా శ్రీనివాసరావు.. పార్టీ మార్పుపై క్లారిటీ!.. ఇంతకీ ఆయన దారెటు..?
అయితే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్గా వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. టీడీపీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వైసీపీలోని కొందరు ముఖ్య నేతలతో చర్చలు జరిపారనే ప్రచారం సాగుతుంది. అదే విధంగా తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపేందుకు ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారని.. డిసెంబర్ 1న తన పుట్టిన రోజు తర్వాత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నట్టుగా ప్రచారం సాగుతోంది.