ఒంగోలు వైఎస్సార్సీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత సింగరాజు వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. 

ఒంగోలు : వైఎస్ఆర్సిపి ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు (55) అనారోగ్యంతో మంగళవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొన్ని నెలలుగా హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన మరణవార్త తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం బౌతికకాయాన్ని ఒంగోలు బండ్ల మిట్టలోని ఆయన నివాస గృహానికి తీసుకెళ్లారు.

కన్నీటిపర్యంతమైన బాలినేని దంపతులు…
వెంకట్రావు భౌతికకాయం ఒంగోలుకు రాగానే వైయస్సార్సీపి రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి, కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వెంకట్రావు భౌతికకాయాన్ని పట్టుకుని బాలినేని కన్నీటిపర్యంతమయ్యారు. నగరంలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న సింగరాజు వెంకట్రావు భౌతికకాయాన్ని చూసేందుకు పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. 

విశాఖలో ఉద్రిక్తత:కార్మికుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఃఠాయింపు

సింగరాజు వెంకట్రావు మృతికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. వెంకట్రావు పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.

వెంకట్రావు ప్రస్థానం …
సింగరాజు వెంకట్రావు నగరంలో వైఎస్సార్సీపీకి ఎంతో కీలకమైన నేత. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో, టిడిపి ప్రభుత్వంలో అద్దంకి బస్టాండ్ లో దుకాణాలను కూల్చివేసిన సమయంలో అండగా నిలబడి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. కమ్మ పాలెంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభాన్ని టీడీపీ నేతలను అడ్డుకున్న సమయంలోనూ ఆయన వారిని ఎదిరించి నిలిచారు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లి వచ్చారు. పార్టీలో ఆయన సేవలకు గుర్తింపుగా సింగరాజు వెంకట్రావు సతీమణి మీనాకుమారికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా నామినేటెడ్ పోస్టు కేటాయించారు.

ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూయడం అందరిని కలిచివేసింది. వెంకట్రావుకు భార్య మీనా కుమారితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రావు బౌతికకాయానికి నగర మేయర్ గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, సింగరాజు రాంబాబు, తోటపల్లి సోమశేఖర్, రామరాజు క్రాంతి కుమార్, పంది రత్నరాజు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, పటాపంజుల శ్రీనివాసులు, సుబ్బారావు, పెద్ది రెడ్డి భాస్కర్ రెడ్డి, షేక్ మీరావలి ఇతర నేతలు నివాళులర్పించారు. కాగా, బుధవారం స్థానిక పార్లమెంట్ లోని వెంకట్రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు