YSRCP: వైసీపీ ఐదో జాబితాపై తీవ్ర కసరత్తు.. మరో రెండు రోజుల్లో జాబితా ప్రకటన!
ఐదో జాబితాపై వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇంకా 15 ఎంపీ, 117 ఎమ్మెల్యే స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. మరో రెండు మూడు రోజుల్లో ఈ జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది.
![ysrcp mulling to announce fitth list of candidates or incharges in andhra pradesh kms ysrcp mulling to announce fitth list of candidates or incharges in andhra pradesh kms](https://static-ai.asianetnews.com/images/01hase3ah94kh0znndtb7r09tg/jagan-mohan_363x203xt.jpg)
YSRCP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార వైసీపీ అన్ని పార్టీల కంటే ముందుగానే కసరత్తు మొదలు పెట్టింది. అభ్యర్థులనూ ముందుగానే ప్రకటిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికి నాలుగు జాబితాలను వైసీపీ ప్రకటించింది. తాజాగా, ఐదో జాబితా కోసం తీవ్ర కసరత్తు మొదలుపెట్టింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఐదో జాబితాను కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది.
ఇప్పటి వరకు పది పార్లమెంటు, 58 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జీలను వైసీపీ ప్రకటించింది. ఇందులో సిట్టింగ్లతోపాటు కొత్తముఖాలకూ అవకాశం ఇచ్చింది. పలువురి సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదు. అయితే, కొందరిని వేరే స్థానాలకు మార్చగా, ఇంకొందరిని పార్లమెంటు స్థానాల్లో బరిలో నిలిపింది. కాగా, వేరే కొందరి అభ్యర్థిత్వాలను పెండింగ్లో పెట్టింది. ఈ జాబితాలోనూ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నట్టు కొన్ని సంకేతాలైతే ఉన్నాయి.
సామాజిక సమీకరణాలు, సర్వే అంచనాలు, ఆర్థిక బలం, ప్రజాదరణ, వ్యతిరేకత, లోకల్ నాన్ లోకల్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంచార్జీలుగా ప్రకటిస్తున్నది. ప్రతి జాబితా ప్రకటన తర్వాత కొంత మంది నేతల్లో అసంతృప్తి కనిపించింది. అయితే, ఈ ఐదో జాబితానే కీలకంగా కనిపిస్తున్నది. మిగిలిన స్థానాలను ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతో పెద్ద సంఖ్యలో ఇంచార్జీలను ప్రకటించే అవకాశం ఉన్నది. ఇందులో సీనియర్లకు మొండి చేయితోపాటు పలువురు కొత్త ముఖాలు తెరమీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో టికెట్ దక్కనివారిని పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా ఉన్నది. అయితే, ఈ ఐదో జాబితాలో ఎవరి పేర్లు గల్లంతవుతాయా? ఎవరికి అవకాశం దక్కిందా? అని తెలుసుకోవడానికి అన్ని వర్గాల్లో ఆసక్తిగా ఉన్నది.
అయితే, వైసీపీ ఈ జాబితాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. దాదాపు 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసుకున్నట్టు భావిస్తున్నారు. కొన్ని చోట్ల సీనియర్ల కంటే కొత్తవారి పట్ల మంచి ఆదరణ ఉన్నట్టు..వారు కూడా ప్రజల్లోకి వేగంగా దూసుకునిపోతున్నట్టు అంచనాలు అందాయి. ఈ సీట్లలో ఎవరిని ఖరారు చేయాలా? అనే అంశంలో వైసీపీ మీమాంసలో పడినట్టు తెలిసింది.
జాబితాలో చోటు దక్కనివారితో ఇప్పటికే చర్చలు, సంప్రదింపుల కార్యక్రమాన్ని వైసీపీ మొదలు పెట్టినట్టు రాజకీయవర్గాలు తెలిపాయి. ఇవన్నింటినీ సంతులనం చేసుకుంటూనే వైసీపీ ఐదో జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది.