టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా టీడీపీలో చేరారు. వీరిందరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన సోదరుడు సురేంద్రనాథరెడ్డి, అక్క హెరెమ్మలు టీడీపీలో చేరారు.
ద్వారకానాథ రెడ్డి మేనకోడలే అలేఖ్యరెడ్డి.. ఈమె దివంగత నందమూరి తారకరత్న సతీమణి. తొలుత ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యుడే. 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడంతో ద్వారకానాథరెడ్డి కాంగ్రెస్లో చేరారు. 2009లో టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది. వైఎస్ జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత 2014లో టికెట్ ఆశించగా దక్కలేదు. అయినప్పటికి నిరాశ చెందకుండా 2019లో వైసీపీ, టీడీపీల నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు.