టీడీపీ ఎమ్మెల్యేల కంటే చంద్రబాబు భద్రతా సిబ్బందే ఎక్కువ : విజయసాయి రెడ్డి సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీకున్న 23 మంది ఎమ్మెల్యేల కంటే చంద్రబాబు భద్రతా సిబ్బందే ఎక్కువంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత కొన్నిరోజులుగా కుప్పంలో జరుగుతున్న ఘటనలపై ఆయన స్పందించారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబుకు కేంద్రం భద్రత పెంచిన విషయంపైనా ఆయన సెటైర్లు వేశారు. టీడీపీ అధినేతకు 24 మంది ఎన్ఎస్జీ కమాండోలతో భద్రత కల్పిస్తున్నారని.. అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకున్న 23 మంది ఎమ్మెల్యేల కంటే చంద్రబాబు భద్రతా సిబ్బందే ఎక్కువంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే నిజానికి చంద్రబాబుకు కుప్పం ప్రజల నుంచే ముప్పు పొంచి వుందని ఆయన అన్నారు. ఎన్నికల హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని .. అందుకే అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
ఇకపోతే ... రెండ్రోజుల క్రితం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పం తన చేతి నుండి జారిపోతుందని చంద్రబాబుకి భయం కలిగిందని రాంబాబు దుయ్యబట్టారు. భయంతోనే ఎప్పుడూ లేని విధంగా తరచూ కుప్పంకి వెళ్తున్నారని, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి గాలేరు నగరి ఎందుకు పూర్తి చెయ్యలేదని అంబటి నిలదీశారు. అధికారంలో ఉండగా పట్టించుకోకుండా ఇప్పుడు ఊరూరా తిరుగుతున్నారని... కుప్పంపై చంద్రబాబుకి ప్రేమ లేదని, రాజకీయ అవసరం మాత్రమేనని ఆయన ఆరోపించారు.
33 ఏళ్లుగా అక్కడ సొంత ఇల్లు కట్టుకోలేదని, కనీసం అద్దె ఇల్లు కూడా లేదని, గెస్ట్ హౌస్ లో ఉంటున్నారంటూ అంబటి ధ్వజమెత్తారు. కుప్పంలో చంద్రబాబు జెండా పీకెయ్యడానికి ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ప్రెస్టేషన్ లో ఉన్నారంటూ మంత్రి సెటైర్లు వేశారు. మా ఇళ్ళల్లో, మా ప్రాంగణాల్లో మా పార్టీ జెండాలు కట్టుకుంటే చంద్రబాబుకి ఏమైందని రాంబాబు నిలదీశారు. దౌర్జన్యంగా మా జెండాలు బ్యానర్స్, ధ్వంసం చేసి మా కార్యకర్తల్ని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. మీ చర్యకు మా వాళ్ళ ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని అంబటి హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువంటే చంద్రబాబుని చూస్తే తెలుస్తుందని మంత్రి సెటైర్లు వేశారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ చూస్తుంటే కుప్పంతో పాటు 175 స్థానాలు వైసీపీ గెలవబోతుందని అర్థం అవుతోందని రాంబాబు జోస్యం చెప్పారు.