ఇప్పుడు జీవో కాపీలే.. రేపు రాజ్యాంగాన్ని కూడా తగులబెట్టేస్తాడేమో : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 1 ప్రతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు వేయడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇవాళ జీవో ప్రతులను తగులబెట్టాడని, రేపు రాజ్యాంగాన్ని తగలుబెడతాడేమోనంటూ ఆయన దుయ్యబట్టారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 1 ప్రతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు వేయడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రతులను తగులబెట్టడం అంటే భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల అమర్యాదగా ప్రవర్తించడమేనని అన్నారు. ఇవాళ జీవో ప్రతులను తగులబెట్టాడని, రేపు రాజ్యాంగాన్ని తగలుబెడతాడేమోనంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో ఒకరు ఇలాగే పబ్లిక్గా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రివర్స్ టెండరింగ్తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందన్నారు. పోలవరం అంశంలో రాజకీయాలకు అతీతమైన సంబంధం వుందని...ఆర్ధిక శాఖ కొర్రీలు వేసి రెండేళ్లు దాటినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఇప్పటికీ డీపీఆర్ 2కి దిక్కులేదని, 31 మంది ఎంపీలు వుండి ఏం చేస్తున్నారని ఉమా ఎద్దేవా చేశారు. 43 నెలలుగా ఢిల్లీ వెళ్లిరావడం తప్ప ఏం సాధించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also REad: జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ.. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన హైకోర్టు..
ఇక, ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వంహెచ్చరించింది.
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ప్రజల మేలు కోసమే తాము ఈ జీవో తీసుకోచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం జీవో నెంబర్ 1ను కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తీసుకొచ్చిందని మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేసింది.