జగన్ విశాఖకు వెళ్తే టీడీపీకి ఓట్లు పడతాయా.. నీ కామెడీకి నవ్వొస్తోంది: లోకేష్కు విజయసాయిరెడ్డి కౌంటర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ వీలైనంత త్వరగా విశాఖకు రాజధానిని మారిస్తే టీడీపీకి ఓట్లు పడతాయంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. లోకేష్ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ (nara lokesh) చేస్తోన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) కౌంటర్ ఇచ్చారు. విశాఖ ప్రజలు తమ పార్టీ వైపే ఉన్నారంటూ ఆయన ట్వీట్ చేశారు.
'అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతూ ఇప్పుడు జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు విశాఖ వాసులు. వైజాగ్ కార్పొరేషన్ సహా ఉత్తరాంధ్ర మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూడలేదా పప్పు నాయుడూ? అర్థం పర్థంలేని నీ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారు' అని విజయసాయిరెడ్డి అన్నారు.
కాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) క్యాంప్ విశాఖకు మకాం మారిస్తే మంచిదంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. క్యాంప్ ఆఫీసు విశాఖలో పెట్టుకుంటే ఉత్తరాంధ్రలో టీడీపీకి (tdp) వచ్చే సీట్లు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే విశాఖలో అరాచకం, భూకబ్జాలు పెరిగిపోయాయని.. ముఖ్యమంత్రి వెళ్తే ఇవి మరింత పెరుగుతాయంటూ లోకేష్ అన్నారు. పరిపాలన అంతా ఒకేచోట నుంచి కొనసాగించి అభివృద్ధిని వికేంద్రీకరించాలనేది తమ విధానమని.. అందులో భాగంగానే తమ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టి 13 జిల్లాల్లోనూ పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు.
టీడీపీ హయాంలో 5.40 లక్షల ఉద్యోగాలు కల్పించామని.. అవన్నీ జిల్లాల్లో వచ్చాయే తప్ప ఒక్క ఉద్యోగం అమరావతి ప్రాంతానికి రాలేదన్నారు లోకేష్. అభివృద్ధి చేయలేని తమ చేతగానితనాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పాట పాడుతోందని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ఆర్థిక పరిస్థితి శ్రీలంక పరిస్థితికి సమానంగా ఉందని.. త్వరలో ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టినా ఆశ్చర్యపడనక్కరలేదని నారా లోకేష్ జోస్యం చెప్పారు. చంద్రబాబు విజనరీ అయితే ముఖ్యమంత్రి జగన్ ప్రిజనరీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.