పెగాసస్ ఇష్యూని అందుకే తెరపైకి తెచ్చారు : వైసీపీ సర్కార్పై రఘురామ ఆరోపణలు
పెగాసస్ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పెగాసెస్ ను తెరపైకి తెచ్చారని రఘురామ ఆరోపించారు.
జంగారెడ్డిగూడెంలో (jangareddy gudem) కల్తీ సారా తాగి పెద్ద సంఖ్యలో జనాలు చనిపోవడంపై నర్సాపురం (narsapuram) వైసీపీ (ysrcp) రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (raghurama krishnam raju) ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణాలు అని చెప్పడం దారుణమన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమ్ముతున్న కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రధాని మోడీ (narendra modi), కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రులకు గతంలోనే లేఖలు రాశానని ఆయన తెలిపారు. కల్తీ మద్యంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పెగాసెస్ ను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్ప, ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని రఘురామ మండిపడ్డారు.
కాగా... ఆంధ్రప్రదేశ్లో పెగాసస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) పెగాసస్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. పెగాసస్పై ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా అని వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ పేర్కొన్నారు.
ఇక, Pegasusపై హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram సోమవారం శాసనసభలో ప్రకటించారు. ఈ విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర సభ్యులు కోరిన మీదట హౌస్ కమిటీ విచారణకు స్పీకర్ ఆదేశించారు. పెగాసెస్ అంశంపై ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranathపాల్గొన్నారు. Chandrababu Naidu పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం Mamata Benarjee అసెంబ్లీలోనే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కచ్చితమైన సమాచారం ఉండి ఉంటేనే మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన గుర్తు చేశారు.
పెగాసెస్ వంటి స్పైవేర్ తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ సాఫ్ట్ వేర్ తో వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకొనే అవకాశం కూడా ఉందన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్ గానే చేస్తారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇది ప్రమాదమే కాదు అనైతికం కూడా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇలాంటి ప్రమాదకర సాఫ్ట్వేర్ ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గమన్నారు.పెగాసెస్తో ఏమేమీ చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.