ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీకి 115 స్థానాలు, వైసీపీకి అభ్యర్ధులూ కష్టమే : రఘురామ సంచలనం
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 115 స్థానాలు, వైసీపీకి 60 స్థానాలు వస్తాయన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను జగన్ మార్చే అవకాశం వుందని ఆయన వ్యాఖ్యానించారు.
సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షానికి (tdp) 115 స్థానాలు, పాలకపక్షానికి 60 సీట్లు మాత్రమే వస్తాయంటూ రఘురామ జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారికంగా చేయించుకున్న సర్వేలో వెల్లడైన విషయం తనకు తెలిసిందంటూ ఆయన బాంబు పేల్చారు.
త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబరులో శాసనసభను రద్దు చేస్తే, మార్చి- ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగొచ్చని రఘురామ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మార్చుతానని తమ పార్టీ అధినేత, సీఎం జగన్ (ys jagan) అంటున్నారని, కానీ దాదాపు 120 ఎమ్మెల్యేలు టికెట్ అడిగే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ఖర్చులు ఇస్తానంటే తప్ప అభ్యర్థులు దొరకరని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ALso Read:టీడీపీలో హాట్ టాపిక్గా ‘‘సర్వే’’: వారిపై కఠినంగానే వ్యవహరిస్తాను.. చంద్రబాబు హెచ్చరికలు..!
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రణాళికలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఇప్పటికే తన వ్యుహాలను అమలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దమనే సంకేతాలు పంపుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లా పర్యటన, మహానాడు సక్సెస్.. టీడీపీలో జోష్ నింపాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టత, నియోజకవర్గాల ఇన్చార్జ్ల పనితీరుపై దృష్టి సారించారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే పార్టీలో గ్రూప్ రాజకీయాలను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలని.. టీడీపీలో పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలన్నారు చంద్రబాబు. తన చుట్టూ ఎవ్వరు తిరిగితే లాభం ఉండదని.. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పారు. నేతల పనితీరును ఎప్పటికప్పుడూ తెలుసుకునే వ్యవస్థ తీసుకోస్తామని కూడా చెప్పారు. 40 శాతం సీట్లు ఈ సారి యువతకు సీట్లు ఇస్తానని ప్రకటించారు. టీడీపీపై అభిమానం ఉన్నవారు పార్టీలో చేరాలని చెప్పారు. పార్టీని నిలబెట్టేది కార్యకర్తలేనని అన్నారు.