ఆయన విజయసాయిరెడ్డి కాదు.. బ్రోకర్ రెడ్డి, ఢిల్లీలో అలానే పిలుస్తారు : రఘురామ వ్యాఖ్యలు
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు విమర్శలు చేశారు. విజయసాయిని ఢిల్లీలో బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయిరెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆగస్ట్ 22న ఢిల్లీకి వెళ్లి మోదీని కలిశారని... ఎందుకు కలిశారో జగన్ కే క్లారిటీ లేదంటూ దుయ్యబట్టారు. లిక్కర్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రిని మందలించడానికే ఢిల్లీకి మోదీ పిలిపించారని అంటున్నారని రఘురామ ఆరోపించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో అవకతవకలు లేవంటూ పార్టీకి సంబంధించిన పత్రికలో తప్పుడు కథనాలు రాశారని ఆయన విమర్శించారు.
ఇకపోతే.. రెండ్రోజుల క్రితం రఘురామ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టక ముందు ఆ ప్రాంతంలోని చాలా జిల్లాల్లోని ప్రజలు ముంబాయ్, సూరత్ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని అన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రా ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలసలు వెళ్తున్నారని చెప్పారు. ఏపీ వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆ పథకాలు సరిగ్గా అమలు జరిగితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఎందుకు పూర్తిగా భర్తీ కావడం లేదని అన్నారు. దేశంలోని అన్ని కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయని సాక్షి దినపత్రికలో స్టోరీలు వచ్చాయని తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు స్టూడెంట్లకు అడ్మిషన్లు దొరకడం లేదని చెప్పారు.
Also Read:జగన్కు ‘రుణరత్న’ అవార్డ్ ఇవ్వాలి... మనకి 'సాక్షి' ఉంది కానీ, మనస్సాక్షి లేదు: రఘురామ సెటైర్లు
ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.40 లక్షల సీట్లు ఉన్నాయని అన్నారు. అందులో కేవలం 78 వేల సీట్లే భర్తీ అయ్యాయని అన్నారు. అలాగే డిగ్రీలో కూడా కేవలం 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. అది కేవలం సాక్షిలోనే కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు నిరాశలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ట్రైన్లలో, బస్సుల్లో పోలీసులుతో తనిఖీలు చేపట్టడం సరైంది కాదని అన్నారు. సొంత డబ్బులతో పేద ప్రజలకు ఆహారం అందించాలని ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను నాశనం చేయడం దారుణం అని అన్నారు. ప్రతీ విషయంలోనూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూట్ కేసులతో దాడులు చేస్తున్నారని చెప్పారు. వాటిని తట్టుకొని తనకు న్యాయం దక్కుతుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు.