లాక్ డౌన్ లోనూ అతి చేస్తున్న రోజా... పూలు చల్లించుకుని...: మాజీ మంత్రి ఫైర్
ఓవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ వైసిపి ఎమ్మెల్యే రోజా అతి ప్రవర్తన మాత్రం కొనసాగుతూనే వుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు.
అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా వైసిపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. ప్రజల వెతలను ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా వదిలేశారని...ఈ కష్ట కాలంలో వారిని ఆదుకోవాలని అన్నారు. లాక్ డౌన్ 40 రోజులకు పొడిగించబడిన సమయంలో కుటుంబానికి రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని అందించాలని జవహర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అరటి, మామిడి, మిరప, వరి పంటలు పూర్తిగా దెబ్బతింటుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని... వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. నష్టపోతున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
''పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తిరిగి తేవాలి. గత ప్రభుత్వం చంద్రన్న భీమాతో అనేక కుటుంబాలను ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం కావాలనుకుంటే పథకం పేరు మార్చైనా అమలు చేయాలి'' అని జవహర్ సూచించారు.
''కరోనా కిట్లకు ఏజెన్సీ ద్వారా ఎందుకు కొనిపించారు? చత్తీస్ ఘడ్ కు ఎందుకు తక్కువగా వచ్చిందో చెప్పాలి? గతంలో మెడ్ టెక్ జోన్ మీద అబద్దపు ప్రచారాలు చేసి మళ్లీ అదే మెడ్ టెక్ జోన్ ను ఉపయోగించుకుంటున్నారు. ప్రతి మనిషికి మూడు మాస్కులన్నారు. ఇంత వరకు ఒక్క మాస్కు రాలేదు'' అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
''పోలీసులు, అధికారులు పూర్తిగా అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు. విజయసాయిరెడ్డి నేషనల్ పర్మిట్ లారీలా తిరుగుతున్నారు. ప్రతిభా భారతి ట్రస్టు ద్వారా విరాళాలు దోచుకుంటున్నారు. కనిగిరి 30 మందితో ఏ విధంగా బెంగళూరు నుంచి వచ్చి చేసిన హంగామా అందరూ చూశారు. అదే విధంగా గుంటూరులో ఎమ్మెల్యే కరోనాను ఏ విధంగా వ్యాప్తి చేశారో చూశాం'' అంటూ వైసిపి ఎమ్మెల్యేల తీరును తప్పుబట్టారు.
''మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఒక వర్గాన్ని కించపరిచారో ప్రజలు గమనించారు. భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు నిత్యావసరాలు లేక ఇబ్బందులకు గురవ్వుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చున్న దానికి జగన్ ఇక్కడ కూర్చున్న పెద్ద తేడా లేదు. చంద్రబాబు అక్కడ ఉన్నా ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం అవుతున్నాం'' అని అన్నారు.
''వైసిపి ఎమ్మెల్యే రోజా ఈ విపత్కర పరిస్థితిలోప్రజలచేత హారతి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజలు అన్ని శుభకార్యాలు మానేస్తే రోజా మాత్రం రోడ్ల మీద తిరుగుతూ ఎందుకు పూలు జల్లించుకొని కీర్తించుకుంటుందో ఎవరికి అర్ధం కావడం లేదు'' అని మాజీ మంత్రి జవహార్ మండిపడ్డారు.