నా చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్తోనే ప్రయాణం.. పార్టీ మార్పు వార్తలపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి క్లారిటీ
పార్టీ మార్పు ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలు అవాస్తమని చెప్పారు.
నెల్లూరు: పార్టీ మార్పు ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలు అవాస్తమని చెప్పారు. చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్లో భాగమే తనపై దుష్ప్రచారం జరుగుతుందని ఆరోపించారు. తాను ఎవరిని సంప్రదించలేదని అన్నారు. ఎమ్మెల్యేల్లో గందళగోళం సృష్టించడానికి చంద్రబాబు గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. పెండింగ్ బిల్స్ ఉన్నాయని, జగన్ గౌరవం ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తనకు రాజశేఖర్ రెడ్డి కుంటుంబం మీద ప్రత్యేక గౌరవని.. జగన్ తనను చాలా బాగా చూస్తారని అన్నారు. జగన్తోనే తన పయనం అని చెప్పారు. తన చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్తోనే తన రాజకీయ ప్రయాణం అని స్పష్టం చేశారు. తాను చనిపోయిన తన కొడుకు జగన్ వెంటే ఉంటారని తెలిపారు.
ఇక, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కోటాలో ఒకటి, పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో.. అధికార వైసీపీకి షాక్ తగిలింది. అయితే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం వారిని సస్పెండ్ కూడా చేసింది. ఆ నలుగురిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా వైసీపీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తుండగా.. ఆ జాబితాలో తాజాగా మరో ఇద్దరు కూడా చేరినట్టయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు వైసీపీలో మరింత మంది అసంతృప్తులు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారనే ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.