అమరావతిని రాజధానిగా ఎందుకు చేయాలి.. విశాఖ ఎందుకు వద్దు: బాబుపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు
అమరావతిని రాజధానిని చేయడానికి, విశాఖను రాజధాని చేయక పోవడానికి కారణాలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, కేంద్రంలో ఆరోజు భాగస్వామిగా ఉన్నారంటూ గుడివాడ దుయ్యబట్టారు.
ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ లో కూర్చొని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చింత చచ్చినా పులుపు చావ లేదని.. తెలుగుదేశం ఆధ్వర్యంలో రేపు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని గుడివాడ ప్రశ్నించారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిడిపి ఉత్తరాంధ్రాకు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్లకోసం ఉత్తరాంధ్ర కావాలని.. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు, టిడిపి నేతలకు లేదని గుడివాడ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిని చేయడానికి, విశాఖను రాజధాని చేయక పోవడానికి కారణాలు చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, కేంద్రంలో ఆరోజు భాగస్వామిగా ఉన్నారు. ఎందుకు అడ్డుకోలేదని ఆయన ఆరోపించారు. ఏ మొహాం పెట్టుకొని ఈ ప్రాంతంలో చర్చా కార్యక్రమం పెడతారంటూ అమర్నాథ్ దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధికి, మీ పాలనలో జరిగిన అభివృద్ధిపైనా చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.