ఎమ్మెల్యే నేనా, ఆయనా... పార్టీ పరిశీలకుడి ముందే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు
గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం ఏం చేయలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి కలకలం రేపారు. తాను ఎమ్మెల్యేనో కాదో చెప్పాలంటూ వైసీపీ పరిశీలకుడి ఎదుటే ప్రశ్నించారు.
వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నిన్న వాలంటీర్ల సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఆయన.. తాజాగా ఇవాళ మళ్లీ రెచ్చిపోయారు. బాలాజీ జిల్లా డక్కిలిలో గురువారం జరిగిన వైసీపీ సమన్వయ సమావేశంలో ఆనం మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేనో కాదో చెప్పాలంటూ ప్రశ్నించారు. వైసీపీ పరిశీలకుడి ఎదుటే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు కూడా అదే అనుమానం వుందని..నియోజకవర్గంలో సమన్వయ లోపం వుందని ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరో ఏడాదిపాటు తానే ఎమ్మెల్యేగా వుంటానని.. కానీ ఒకరు మాత్రం తానే ఎమ్మెల్యేను అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆనం పేర్కొన్నారు. గతంలోనూ ఆయన ఇలాగే హడావుడి చేసి మధ్యలోనే పారిపోయారని రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Also REad : నాలుగేళ్లలో చేసిందేంటీ.. పెన్షన్లకు ఓట్లు వేస్తారా, టీడీపీ కూడా ఇచ్చింది : జగన్ ప్రభుత్వంపై ఆనం విమర్శలు
ఇకపోతే.. బుధవారం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు, గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులిస్తోందని... అప్పుటు నీళ్లిస్తామని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కేంద్రం నిధులిస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ఆనం ప్రశ్నించారు. ప్రాజెక్ట్లేమైనా కట్టామా... పనులు మొదలుపెట్టామా అని ఆయన నిలదీశారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా, గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చిందని, ఏమైందని ఆనం ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పానని, లే ఔట్లు వేశామే కానీ ఇళ్లు కట్టామా అని ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు.
కాగా.. అధికారులతో సమీక్ష సందర్భంగా వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు.