బెదిరింపులకు పార్టీ మారడం పిరికితనం, ఇక గేర్ మారుస్తా: చంద్రబాబు
బెదిరింపులు, వేధింపులతో తమ పార్టీ నేతలను వైసీపీలో చేర్చుకొంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. బెదిరింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమన్నారు.
అమరావతి:బెదిరింపులు, వేధింపులతో తమ పార్టీ నేతలను వైసీపీలో చేర్చుకొంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. బెదిరింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమన్నారు.
బుధవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ నుండి ఒకరు వెళ్తే వంద మంది తయారౌతారన్నారు. టీడీపీ రాజకీయ విశ్వవిద్యాలయమని ఆయన గుర్తుచేశారు.
మళ్లీ సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందిస్తామన్నారు. రానున్న 40 ఏళ్లకు ధీటైన నాయకత్వాన్ని అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై ఇక టీడీపీ గేరు మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా ఇంతకింత చెల్లిస్తామన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఎవరూ కూడ అధైర్యపడొద్దని ఆయన కోరారు. అన్ని విధాలా పోరాటం చేస్తామన్నారు.
వృత్తిదారులకు చేదోడు పథకం జగన్మాయా పథకమని ఆయన విమర్శించారు. అబద్దమే వైసీపీ ఆయుధమన్నారు. గతంలో అందరికీ లబ్ధి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు దుకాణాలు ఉన్నవారికేనని మాట మార్చారన్నారు. చేదోడు పేరుతో భారీగా కోతలు పెట్టారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో 5.50 లక్షలమందికి పైగా నాయీ బ్రాహ్మణులుంటే కేవలం 38 వేలమందికే ప్రభుత్వ ఆర్థిక సాయం ఇస్తున్నారన్నారు. సెలూన్లకు టీడీపీ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:బాబుకు షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులను పది రెట్లు చేసిందన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది టైలర్లు ఉన్నారు. లక్షా 25 వేలమంది టైలర్లకే ఆర్థికసాయం చేస్తున్నారని ఆయన చెప్పారు.
రజకులు 15 లక్షల మంది ఉంటే 82 వేలమందికే సాయం వర్తిస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్లు సగానికి తగ్గించారని ఆయన ఆరోపించారు.