చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టాలి: వైఎస్సార్సిపి నాయకురాలి డిమాండ్
దళితుల గురించి అవమానకరంగా మాట్లాడటమే కాకుండా...వారిపై బెదిరింపులకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సిపి నాయకురాలు తానేటి వనిత డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ను కాపాడేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
దళితుల గురించి అవమానకరంగా మాట్లాడటమే కాకుండా...వారిపై బెదిరింపులకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సిపి నాయకురాలు తానేటి వనిత డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ను కాపాడేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
చింతమనేనిపై కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయలేకపోయారని వనిత తెలిపారు. ఇలా పోలీసులు అధికారపార్టీపై భయంతోనే ఈ వ్యవహారంలో వెనుకడుగు వేస్తున్నారని వనిత పేర్కొన్నారు. వెంటనే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
దళితులు రాజకీయాల్లో పనికిరారంటూ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి మాట్లాడటం చాలా బాధ కలిగించిందన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని...లేకుంటే బలహీనవర్గాల ప్రజలంతా కలిసి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
తమ పార్టీ ఎమ్మెల్యే అయినందువల్లే చింతమనేని ప్రభాకర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చింతమనేని వీడియోనే మార్ఫింగ్ చేశారనడం విడ్డూరంగా వుందన్నారు. పలు సందర్భాల్లో చంద్రబాబు కూడా దళితులను అవమానించేలా మాట్లాడారని గుర్తుచేశారు. దళిత సమాజాన్ని ఆయన ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని వనిత ఆరోపించారు.