కాల్పులు జరగాలన్నదే చంద్రబాబు కుట్ర.. చర్యలు తప్పవు, ఆధారాలతో సహా దొరికిపోయారు : సజ్జల సంచలన వ్యాఖ్యలు
పుంగనూరు ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు అండ్ కో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రీ ప్లాన్డ్గానే అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. పోలీసులు కాల్పులు జరపాలని రెచ్చగొట్టారని సజ్జల పేర్కొన్నారు. పోలీసులు సంయమనంతో వుండబట్టే ఘోరం జరగలేదని.. చంద్రబాబు పైశాచిక చర్యలను ఇక ఉపేక్షించేది లేదని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు చర్యలకు తాము రెచ్చిపోమని.. రాజకీయంగా సంయమనం పాటిస్తామన్నారు.
చంద్రబాబుతో పాటు అందరిపై చట్టపరంగా చర్యలు వుంటాయని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు అండ్ కో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, సీబీఐ విచారణకు సిద్ధమంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అంగళ్లులో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునని.. చంద్రబాబు పోలీసులను రెచ్చగొట్టారని సజ్జల ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఏం చేయలేనని చంద్రబాబుకు అర్ధమైందని.. అందుకే అరాచకాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also Read: నన్ను చంపాలని చూశారు: పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణకు బాబు డిమాండ్
అంతకుముందు తనపై పుంగనూరులో హత్యాయత్నం జరిగిందంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో పోలీసులు, వైసీపీ శ్రేణులపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఒక కానిస్టేబుల్ కాళ్లు పోయాయని, దీనికి బాధ్యులు ఎవరు అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు పెట్టకపోతే రాజ్యాంగం లేనట్లేనని ఆయన తేల్చిచెప్పారు. పుంగనూరులో చంద్రబాబుపై ఎలాంటి హత్యాయత్నం జరగలేదన్నారు.
ప్రాజెక్ట్లపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారని , సెల్ఫోన్ కనిపెట్టిన ఆయనకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందంటూ అంబటి సెటైర్లు వేశారు. వైఎస్ ప్రారంభించకపోతే పోలవరం ప్రాజెక్ట్ వుండేది కాదని, ఈ ప్రాజెక్ట్ను చంద్రబాబు నాశనం చేశారని రాంబాబు ఆరోపించారు. ఏదో జరిగిపోతున్నట్లు రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని.. దోచుకుంది, దాచుకుంది చంద్రబాబేనని ఆయన ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తాము ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని మంత్రి తెలిపారు. అధికారంలో వున్నప్పుడు సీబీఐకి అనుమతి నిరాకరించిన వ్యక్తి.. ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం సిగ్గు చేటన్నారు. ముద్రగడను చంద్రబాబు హింసించారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.