యార్లగడ్డను పోతే పోని అని నేను అంటానా.. ఆయనను ఎవ్వరూ అవమానించలేదు : సజ్జల కౌంటర్
వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన గన్నవరం నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. యార్లగడ్డను ఎవరూ అవమానించలేదని.. వెంకట్రావుకు మంచి భవిష్యత్తు వుంటుందని తన లాంటి వారు చెప్పారని సజ్జల పేర్కొన్నారు.
వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన గన్నవరం నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావుపై ప్రభుత్వ సలహాదారు, వైసీప ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యార్లగడ్డను పోతే పోనీ అని తాను అన్నట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు. తాను అలా ఎందుకు అంటానని సజ్జల ప్రశ్నించారు. తానే కాదు మా పార్టీలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేరనని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
యార్లగడ్డను ఎవరూ అవమానించలేదని.. వెంకట్రావుకు మంచి భవిష్యత్తు వుంటుందని తన లాంటి వారు చెప్పారని సజ్జల పేర్కొన్నారు. జనసేన పార్టీ విధానం చూస్తేనే వెనుక చంద్రబాబు వున్నారని స్పష్టమవుతోందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎలా చెబితే పవన్ కల్యాణ్ అలా చేస్తాడని ఆయన దుయ్యబట్టారు.
ఇకపోతే.. యార్లగడ్డ వెంకట్రావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. వైసీపీకి ఈరోజు ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారంనాడు విజయవాడలో అనుచరులతో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమెరికా నుండి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వైసీపీలో తనకు అవమానాలు జరిగాయని చెప్పారు. మూడు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయన్నారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూనే టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
ALso Read: వైసీపీకి రాజీనామా, టీడీపీలోకి యార్లగడ్డ : చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరిన వెంకటరావు
తాను పనికి వస్తానని భావిస్తే వచ్చే ఎన్నికల్లో తనకు గన్నవరం నుండి టిక్కెట్టు ఇవ్వాలని యార్లగడ్డ వెంకటరావు చంద్రబాబును కోరారు. గత ఎన్నికల్లో తనకు వైసీపీ టిక్కెట్టు ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. గన్నవరం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని యార్లగడ్డ వెంకటరావు విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు.
అయితే టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ చేతిలో యార్లగడ్డ వెంకటరావు స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకి మద్దతు పలికారు. దీంతో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య రాజీకి పార్టీ నాయకత్వం ప్రయత్నించింది.