వైసీపీలో షర్మిల ఒక్కరే కష్టపడలేదు .. జగన్, విజయమ్మలది అంతే పాత్ర : సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ఎన్నో చేసిందని సజ్జల ఎద్దేవా చేశారు. షర్మిల ఏపీలో ఉండి మాట్లాడుతున్నారా , తెలంగాణలో వుండి మాట్లాడుతున్నారా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
![ysrcp leader sajjala ramakrishna reddy counter to apcc chief ys sharmila over her comments on cm ys jagan ksp ysrcp leader sajjala ramakrishna reddy counter to apcc chief ys sharmila over her comments on cm ys jagan ksp](https://static-ai.asianetnews.com/images/01gzqwrajne8agdw0ny82ay87h/sajjala-response-jpg_363x203xt.jpg)
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల మాట్లాడిన ప్రతీదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆమె వ్యాఖ్యలకు పొంతన వుండటం లేదని, జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ఎన్నో చేసిందని సజ్జల ఎద్దేవా చేశారు. షర్మిల ఏపీలో ఉండి మాట్లాడుతున్నారా , తెలంగాణలో వుండి మాట్లాడుతున్నారా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ మరణం తర్వాత రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు నోరు విప్పలేదని ఆయన నిలదీశారు.
ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదరని.. వైఎస్సార్ బిడ్డ, జగన్ సోదరనే కారణంతోనే ఏపీ బాధ్యతలు అప్పగించారని సజ్జల అన్నారు. గందరగోళం వుండొద్దనే షర్మిల అసంబద్ధ, డొల్ల వ్యాఖ్యలపై స్పందిస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కి షర్మిల ఎందుకు ప్రచారం చేయలేదని సజ్జల ప్రశ్నించారు. షర్మిల ఒక్కరే కాదు జగన్ కూడా ఆరోజు కష్టపడ్డారని.. ఆయనను 16 నెలలు జైల్లో పెట్టారని గుర్తుచేశారు. అప్పట్లో విచారణ చేసిన సీబీఐ జేడీ కూడా వీటిని అక్రమ కేసులు అన్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీలో కార్యకర్తలు, విజయమ్మ, జగన్తో పాటు షర్మిల పాత్ర కూడా వుందన్నారు.
ఓదార్పు యాత్ర చేసినందుకు కాంగ్రెస్ ఏ స్థాయిలో వేధించిందో అందరికీ తెలుసునని ఆయన దుయ్యబట్టారు. షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ రాయించారేమోనంటూ సజ్జల ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్లో ఏం వుందో తెలియకుండా బట్టీపట్టి మాట్లాడుతున్నారని, హోదాపై పోరాటం ఎలా వుండాలి, దానికో నిర్వచనం వుందా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కూడా ఇంత అడ్డగోలుగా అబద్ధాలు చెప్పరని, పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా అంటూ ఆయన నిలదీశారు. హోదాపై వైసీపీ ప్రయత్న లోపం లేదని, షర్మిల అన్యాయం జరిగిందంటున్నారు, ఆమెకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ను తిట్టిన షర్మిల ఇప్పుడు అదే పార్టీలో చేరారని చురకలంటించారు. ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్ అమలు కావడం లేదని అనడం విచిత్రంగా వుందన్నారు. వైఎస్సార్టీపీలో షర్మిలతో పాటు చాలా మంది తిరిగారని, అనర్హత వేటు అనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయమన్నారు.