కొత్త పార్టీలు రావాల్సిందే.. ఏపీ వ్యవహారాలు తెలంగాణ మంత్రులకెందుకు : బీఆర్ఎస్పై సజ్జల వ్యాఖ్యలు
రాజకీయాల్లో కొత్త పార్టీలు రావాల్సిందేనన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొత్త జాతీయ పార్టీ బీఆర్ఎస్పై ఆయన ఈ మేరకు స్పందించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొత్త జాతీయ పార్టీ బీఆర్ఎస్పై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేనని అన్నారు. కొత్త పార్టీల విషయంలో తాము వర్రీ కావాల్సిన అవసరం లేదని సజ్జల తేల్చిచెప్పారు. ప్రజలకు ఏం చేశామనే దానిపైనే పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుందని రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఏపీ ప్రజలు వైసీపీని ఓన్ చేసుకున్నారు కాబట్టే తమకే మద్ధతిస్తారని నమ్ముతున్నాని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోటీ పెరగడం వల్ల పనితీరు మెరుగుపడి ప్రజలకు మరింత మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమది రాజకీయాల కోసం ఎత్తుగడలు వేసే పార్టీ కాదని.. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడాలని తాము అనుకోవడం లేదని సజ్జల పేర్కొన్నారు.
ALso Read:ఆషామాషీగా జాతీయ పార్టీ పెట్టలేదు.. సీఎంగానే దేశమంతా తిరుగుతా, మహారాష్ట్ర నుంచే మొదలు : కేసీఆర్
ఎన్నికల ముందు ఇచే హామీలు పవిత్రంగా ఉండాలని.. 100కి వంద శాతం అమలయ్యేలా ఉండాలన్నారు. లేదంటే ఆకాశంలో చుక్కలు తెస్తామని కూడా అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మ్యానిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యమేనా అన్నది పరిశీలించాలని సజ్జల హితవు పలికారు. తాము చెప్పినవవి 98 శాతం పైగా పూర్తి చేశామని... అంతకుముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని ఆయన ఆరోపించారు. ఆ రోజు 2014లో ఇలాంటి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఉంటే తామే అధికారంలోకి వచ్చేవాళ్లమని సజ్జల పేర్కొన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషకుల స్థానంలో లేమని... మా రాష్ట్రం అభ్యున్నతే వైసీపీకి ముఖ్యమని రామకృష్ణారెడ్డి అన్నారు.
చిరంజీవి తన తమ్ముడి గురించి ఒక అన్నగా ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడారని సజ్జల పేర్కొన్నారు. ఈ రాష్ట్రం తమ వేదిక...ఇక్కడి ప్రజల బ్లేస్సింగ్స్ అడుగుతున్నామని, పక్క రాష్ట్రాల గురించి తాము మాట్లాడటం లేదని ఆయన తేల్చిచెప్పారు. వాళ్ళు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి విమర్శలు చేయడం ఎందుకని సజ్జల ప్రశ్నించారు. భవిష్యత్తు రాజకీయాల గురించి వాళ్ళు అలా చేస్తున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాము ఇక్కడి వ్యవహారాలపై మాత్రమే కట్టుబడి ఉన్నామని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.