చంద్రబాబుకు కొన్ని వర్గాలపై ద్వేషం.. పేదల ఇళ్లకోసం జగన్ ఎక్కడి వరకైనా వెళ్తారు : సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతిలోని పేదలు, రైతు కూలీలను చంద్రబాబు ప్రభుత్వం తరిమేసిందని ఆరోపించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేదలకు అమరావతిలో ఇళ్లు ఇస్తుంటే అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు.
న్యాయపరమైన అడ్డంకులు లేకుంటే రాష్ట్రంలో ఈపాటికే మూడు రాజధానులు వచ్చేవని అన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎల్లుండి అమరావతిలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న గృహ నిర్మాణ ప్రాంతాన్ని ఆయన మంత్రులు, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో పేదల సొంతింటి కల నిజమవుతోందన్నారు. పేదలు అమరావతిలో వుండొద్దనేది గత ప్రభుత్వ ఆలోచన అని.. అందుకే ఇక్కడి పేదలు, రైతు కూలీలను చంద్రబాబు ప్రభుత్వం తరిమేసిందని సజ్జల ఆరోపించారు.
రైతుల ముసుగులో ఇక్కడి భూములు కొన్నది టీడీపీ నేతలేనని రామకృష్ణారెడ్డి అన్నారు. పేదలకు అమరావతిలో ఇళ్లు ఇస్తుంటే అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేయించి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల పక్షపాతిగానే వున్నారని.. పేదలకు ఇచ్చిన మాట కోసం జగన్ కృషి చేశారని సజ్జల తెలిపారు. అన్ని సౌకర్యాలతో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని.. ఒక ప్రైవేట్ లే ఔట్లా సౌకర్యాలు కల్పిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ALso Read: ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్లు.. న్యాయస్థానాలు ఆమోదిస్తాయనే నమ్ముతున్నాం : ఆళ్ల రామకృష్ణారెడ్డి
గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవని.. ఈ ఇళ్ల నిర్మాణాలు చూశాక చంద్రబాబు కుళ్లుకోవడం ఖాయమన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీకి 300 ఎకరాలు ఏ అనుమతితో గతంలో ఇచ్చేశారని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు ఇక్కడ రాజధాని అని భ్రమ కల్పించారని.. ఆర్ 5 జోన్లో 6 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పే
దల ఇళ్ల కోసం ఏ స్థాయిలోనైనా తాము పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో కనీసం రోడ్డు కూడా వేయలేదని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబుకు కొన్ని ప్రాంతాల మీద, కొన్ని సామాజిక వర్గాల మీద ద్వేషమని సజ్జల ఆరోపించారు.