గాజువాకతో వైసీపీ సతమతం .. ఆయన పోయి ఆమె వస్తారా, తిప్పల వర్గానికి ఏది దారి..?
మరోసారి గాజువాకలో విజయం సాధించాలని అధికార వైసీపీ కృతనిశ్చయంతో వుంది. గత ఎన్నికల్లో పవన్ను మట్టికరిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి మరోసారి టికెట్ అవకాశాలు దాదాపు లేనట్లేనని టాక్.
![YSRCP considers woman candidate for Gajuwaka ksp YSRCP considers woman candidate for Gajuwaka ksp](https://static-ai.asianetnews.com/images/84b36eb8-13a6-4d4c-8e68-c7b743413f18/image_363x203xt.jpg)
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీలో అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. టికెట్ ఇవ్వకుండా కొందరిని జగన్ పక్కనబెడితే.. మరికొందరు ముందే సర్దేసుకుంటున్నారు. అలాగే ఇంకొందరిని నియోజకవర్గాలు మార్చి ప్రయోగానికి సిద్ధమయ్యారు జగన్. కొత్త ముఖాలకు నియోజకవర్గాల్లో సహాయ నిరాకరణ ఎదురవుతోంది.
అలాంటి వాటిలో ఒకటి గాజువాక నియోజకవర్గం . విశాఖలో అత్యంత కీలక నియోజకవర్గమైన ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో రాష్ట్ర ప్రజల దృష్టి ఈ స్థానంపై పడింది. పోయిన చోటే వెతుక్కోవాలన్న సూత్రం ప్రకారం .. వచ్చే ఎన్నికల్లోనూ పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ జనసేనాని నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
ఇదిలావుంటే.. మరోసారి గాజువాకలో విజయం సాధించాలని అధికార వైసీపీ కృతనిశ్చయంతో వుంది. గత ఎన్నికల్లో పవన్ను మట్టికరిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి మరోసారి టికెట్ అవకాశాలు దాదాపు లేనట్లేనని టాక్. కేడర్తో పాటు ప్రజలు కూడా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకంగా వున్నట్లు జగన్కు అందిన సర్వే నివేదికల్లో తేలింది. వెంటనే అప్రమత్తమైన వైసీపీ అధినేత.. వెంటనే కార్పోరేటర్గా వున్న ఉరుకూటి రామచంద్రరావును రాత్రికి రాత్రి ఇన్ఛార్జ్గా ప్రకటించింది. దీంతో తిప్పల వర్గం గుర్రమంటోంది.. టికెట్ ఎట్టి పరిస్ధితుల్లోనూ నాగిరెడ్డికే ఇవ్వాలని లేనిపక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మధ్యలో కొంత సైలెంట్ అయిన తిప్పల వర్గానికి.. తదుపరి వైసీపీ ప్రకటించిన జాబితాల్లో ఇన్ఛార్జ్లను మార్చుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రాణం లేచొచ్చినట్లయ్యింది. కానీ విశాఖ మేయర్గా వున్న గొలగాని హరి వెంకట కుమారిని గాజువాక ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతూ వుండటంతో తిప్పల వర్గానికి షాక్ తగిలినట్లయ్యింది. ఇమె కూడా ఉరుకూటి సామాజిక వర్గమే కావడం, పైగా మహిళా నేత కావడంతో ఇబ్బందులు ఎదురుకావన్నది వైసీపీ హైకమాండ్ స్కెచ్. కానీ ఇన్ఛార్జ్ని మార్చినంత మాత్రాన తిప్పల వర్గం సైలెంట్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి వుంది.