వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు కూడా ఈరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలో మంగళవారం వివేకా కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా రాసిన లేఖపై వీరిద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సీబీఐ ఎదుట హాజరైన వీరిద్దరూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు ఈరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజును ఘటనాస్థలంలో ఉదయ్ కుమార్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే వీరిని విచారణకు పిలిచింది.
ALso Read: పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత
ఇదిలావుండగా.. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం విచారణకు హాజరుకావాల్సిందిగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల సమయం కోరుతూ సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డికి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని కోరారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున విచారణకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
పులివెందులకు అవినాష్ రెడ్డి..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించారు. తాజాగా దాదాపు 20 రోజుల విరామం తర్వాత సోమవారం అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు లేఖ రాసిన అవినాష్ రెడ్డి.. తన సొంత జిల్లాలో పార్టీ పరమైన కార్యకలాపాలు ముందుగా నిర్ణయించుకున్నందున నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు.
ఇక, అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. అయితే అవినాష్ రెడ్డి రాకముందే సీబీఐ అధికారులు పులివెందులలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ వెంటనే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి డ్రైవర్కు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.
