వైసీపీ అధినేత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై అన్నివర్గాల్లోనూ ఆసక్తి మొదలైంది. ముందుగా రాయలసీమ జిల్లాల్లోని నాలుగు జిల్లాల్లోని సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది.
వైసీపీ అధినేత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై అన్నివర్గాల్లోనూ ఆసక్తి మొదలైంది. వచ్చే నెల 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3వేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.
ముందుగా రాయలసీమ జిల్లాల్లోని నాలుగు జిల్లాల్లోని సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. నవంబర్ 3వ తేదీన జగన్ తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. నవంబర్ 4వ తేదీ శనివారం తిరుమలలో వెంకటేశ్వరుని దర్శించుకొని తర్వాత రోడ్డు మార్గంలో కడపకు చేరుకుంటారు. కడపలోని దర్గా, కేథడ్రల్ చర్చిలలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి పులివెందులకు చేరుకుంటారు.
నవంబర్ 5వ తేదీ ఆదివారం ఉదయం పులివెందుల్లోని సీయస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొంటారు. మళ్ళీ రాత్రికి ఇడుపులపాయకు చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం ఇడుపులపాయలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తన పాదయాత్రలో భాగంగా కడప జిల్లాలో 8 రోజుల పాటు సుమారు 120 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. పులివెందుల – కమలాపురం – జమ్మలమడుగు – ప్రొద్దుటూరు – మైదుకూరు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగనుంది.

తర్వాత కర్నూలు జిల్లాలోని చాగలమర్రి మీదుగా అనంతపురం- చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశిస్తారు. పాదయాత్రలో జగన్ ఎక్కువగా టీడీపీ శాసనసభ్యుల, మంత్రుల నియోజకవర్గాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో కూడా ప్రధానంగా వైకాపా నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో పాదయాత్ర జరిగేలా ప్రత్యేక రూట్ మ్యాప్ ను ఫైనల్ చేసారు.
వచ్చే ఏడాది మే 2వ తేదీకి తన పాదయాత్రను ముగించేందుకు జగన్ రూట్ మ్యాప్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పనిలో పనిగా ఇతర పార్టీల్లో నుండి వైసీపీలోకి చేరనున్న పలువురు నేతలను కూడా పాదయాత్ర సందర్భంగానే జగన్ కండువాలు కప్పనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
