చంద్రబాబు చేతిలో పేపర్ తీసుకొని కౌంటరిచ్చిన జగన్
వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ సభ్యుల ప్రశ్నలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కౌంటరిచ్చారు. తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే ఉద్దేశ్యంతోనే టీడీపీ నేతలకు భయం పట్టుకొందన్నారు.
అమరావతి: బలహీనవర్గాల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తీసుకొస్తే టీడీపీ అడ్డుకోవాలని భావిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శలపై ఏపీ సీఎం జగన్ కౌంటరిచ్చారు.
చంద్రబాబునాయుడు చేతిలో ఉన్న పేపర్ ను తీసుకొని జగన్ ఈ పథకంపై వివరణ ఇచ్చారు. ఈ బిల్లుపై రాజకీయ లబ్ది కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.
నామినేటేడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై చట్టం చేస్తే టీడీపీకి ఇబ్బంది కలుగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు..
చంద్రబాబునాయుడు చదివి విన్పించిన పత్రికలో వచ్చిన వార్త తర్వాతే వైఎస్ఆర్ చేయూత పథకానికి రూపకల్పన చేసినట్టుగా జగన్ వివరించారు. చంద్రబాబునాయుడు చదివిన పత్రిక 2017 అక్టోబర్ 18వ తేదీన వచ్చిందని జగన్ చెప్పారు. కానీ, తన పాదయాత్ర విశాఖ జిల్లాలో సాగుతున్న సమయంలో మాడ్గుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత పథకం గురించి ప్రకటించినట్టుగా ఆయన గుర్గు చేశారు.
మాడ్గుల అసెంబ్లీ నియోజకవర్గంలో తన పాదయాత్ర సాగుతున్న సమయంలో వైఎస్ఆర్ చేయూత పథకం గురించి ప్రకటించిన విషయాన్ని జగన్ స్పీకర్ అనుమతితో టీవీ క్లిప్పింగ్లను సభలో చూపించారు.
మాడ్గుల నియోజకవర్గంలో తన పాదయాత్ర సాగిన సమయంలో 2018 సెప్టెంబర్ 3వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకంపై ప్రకటన చేసినట్టుగా ఆయన వివరించారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వీలుగా చట్టాలు తయారు చేస్తున్నట్టుగా వైఎస్ జగన్ ప్రకటించారు.
చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ రిజర్వేషన్ల విషయమై పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే డిమాండ్ తో ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.ఇవన్నీ అమలైతే తమ ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందనే కారణంగానే అడ్డుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని సీఎం జగన్ ఆరోపించారు.