కౌరవపాలనకు దగ్గరపడింది....రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న జగన్
- జన సంకల్పయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ‘రచ్చబండ’ కార్యక్రమం జరిగింది.
- రెండో రోజు పాదయాత్రలో భాగంగా వేంపల్లెలోని శ్రీనివాసకల్యాణ మండపలంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన రచ్చబండ కు జనాలు విపరీతంగా వచ్చారు.
జన సంకల్పయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ‘రచ్చబండ’ కార్యక్రమం జరిగింది. రెండో రోజు పాదయాత్రలో భాగంగా వేంపల్లెలోని శ్రీనివాసకల్యాణ మండపలంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన రచ్చబండ కు జనాలు విపరీతంగా వచ్చారు. కార్యక్రమం ఆరంభంలోనే ప్రజల నుండి సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు రావటం లేదని, ఫీజు రీం ఎంబర్స్ మెంట్ రావటం లేదని, ఉద్యోగాలు ఇవ్వటం లేదని, వ్యవసాయ విద్యుత్ సక్రమంగా సరఫరా కావటం లేదని, పక్కా ఇళ్ళు లేవని...ఇలాంటి సమస్యలను అనేకం చెప్పుకున్నారు.
ప్రజల ఫిర్యాదులు విన్న తర్వాత జగన్ మాట్లాడుతూ, ప్రతీ మండలంలోనూ వృద్ధాప్య ఆశ్రమం నిర్మిస్తామన్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా కడప స్టీల్ ఫ్యాక్టరీని మూడేళ్ళల్లో నిర్మించి ఒకేచోట 10 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లను వెయ్యి రూపాయల నుండి రూ. 2 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఒక యువతి మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినా కనీసం ఊరికో ఉద్యోగం కూడా రాలేదని మండిపడ్డారు. జనాలడిగిన పలు ప్రశ్నలకు జగన్ సమాధానమిస్తూ ఒక్క ఏడాదికాలం ఓపికపట్టండని ఓదార్పు మాటలు మాట్లాడారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎలా కావాలంటే అలా చేసుకుందామన్నారు. తర్వాత మాట్లాడుతూ ‘తానింకా చాలా దూరం వెళ్ళాల్సున్న కారణంగా బయలుదేరుతున్నట్లు’ చెప్పి రచ్చబండ కార్యక్రమాన్ని ముగించారు.