లీజుకు అమరావతి భవనాలు... జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం, ‘విట్’తో సంప్రదింపులు
ఏపీ రాజధాని అమరావతిలోని ప్రభుత్వ భవనాలను లీజుకు ఇవ్వాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విట్ యూనివర్సిటీ ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
అమరావతిలో ఏపీ రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. దీని కోసం రాజధాని పరిధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలను (govt buildings) లీజుకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఉద్యోగుల వసతి కోసం నిర్మిస్తోన్న డీ టైప్ భవనాలను లీజుకు ఇచ్చేలా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. డీ టైప్ బిల్డింగ్స్లోని ఓ టవర్ని లీజుకు తీసుకోవడానికి విట్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. దీంతో విట్ యాజమాన్యంతో సీఆర్డీఏ చర్చలు జరుపుతోంది. లీజు ద్వారా ఏడాదికి రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం వుందని అంచనా. ఒక్కో టవర్లో 120 ప్లాట్లు వున్నాయి.
మరోవైపు అమరావతి (amaravathi) రాజధాని భూములను (crda lands) అమ్మాలని జగన్ సర్కార్ (ysrcp) నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా రాజధాని భూములను విక్రయించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాల భూముల విక్రయానికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్థారించింది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతినిస్తూ.. జీవో నెం 389 జారీ చేసింది ప్రభుత్వం.
Also Read:అమ్మకానికి అమరావతి రాజధాని భూములు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం, ఎకరా ఎంతంటే..?
వచ్చే నెలలోనే భూములను వేలం వేయనుంది సీఆర్డీఏ. మరో 600 ఎకరాల భూమి కూడా అమ్మాలని సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.