అమ్మకానికి అమరావతి రాజధాని భూములు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం, ఎకరా ఎంతంటే..?
అమరావతి రాజధాని భూములను విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జీవో నెం 389 జారీ చేసింది.
ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ (ys jagan govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి (amaravathi) రాజధాని భూములను (crda lands) అమ్మాలని నిర్ణయించింది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా రాజధాని భూములను విక్రయించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాల భూముల విక్రయానికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్థారించింది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతినిస్తూ.. జీవో నెం 389 జారీ చేసింది ప్రభుత్వం.
వచ్చే నెలలోనే భూములను వేలం వేయనుంది సీఆర్డీఏ. మరో 600 ఎకరాల భూమి కూడా అమ్మాలని సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.